హోదా ఇచ్చిన వారికే మా మద్ధతు.. బాబు 40 ఏళ్ల అనుభవం ఎక్కడికి పోయింది: విజయసాయి
హోదా, విభజన హామీల అమలుపై రాజ్యసభలో నోటీస్ ఇచ్చామని... ఈ వారంలోనే కచ్చితంగా అది చర్చకు వస్తుందని విజయసాయి తెలిపారు.
ప్రత్యేకహోదా, విభజన హామీలను అమలు చేయాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. హోదా, విభజన హామీల అమలుపై రాజ్యసభలో నోటీస్ ఇచ్చామని... ఈ వారంలోనే కచ్చితంగా అది చర్చకు వస్తుందని విజయసాయి తెలిపారు. హోదా సాధించే విషయంలో టీడీపీకి ఎలాంటి చిత్తశుద్ధి లేదని..
నాడు చంద్రబాబు చెప్పినందుకే రాష్ట్రానికి ఆర్థికసాయం ప్రకటించారని.. కేంద్రానికి కృతజ్ఞతలు చెబుతూ ధన్యవాద తీర్మానం కూడా చేశారని గుర్తు చేశారు. ఈ ధన్యవాద తీర్మానాన్ని చంద్రబాబు విత్డ్రా చేసుకున్నారా లేదా అని ప్రశ్నించారు. టీడీపీ ఇకనైనా రాష్ట్రప్రయోజనాల కోసం పోరాడాలని సూచించారు.
చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఎక్కడికి పోయిందని.. పొలిటికల్ డ్రామాలను ఇక మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్, బీజేపీలతో పాటు టీడీపీ కూడా రాష్ట్రానికి ద్రోహం చేసిందని విమర్శించారు. ఏపీకి హోదా ఎవరిస్తే వారికే వైసీపీ మద్ధతుగా ఉంటుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.