పలువురు ఎంపిలకు అనారోగ్యం: మేకపాటికి అస్వస్తత
ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైసిపి ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డికి అస్వస్తతకు గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఏపి భవన్లో నిరాహార దీక్షకు కూర్చున్న మేకపాటికి శనివారం తెల్లవారుజామున తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది.
వెంటనే ఏపి భవన్ అధికారులు వైద్యులను పిలిపించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు దీక్షను విరమించాలని సూచించారు. అయితే, దీక్షను విరమించేందుకు మేకపాటి నిరాకరించారు. ప్రత్యేక హోదాపై ఎట్టిపరిస్థితుల్లో వెనకడుగు వేయనని అన్నారు.
కాగా, శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో పెనుగాలులకు ఏపీ భవన్లోని దీక్ష శిబిరం కకావికలమైంది. అయినా వైఎస్సార్సీపీ ఎంపీలు భవన్లో దీక్షను కొనసాగిస్తున్నారు. ఎంపీల దీక్షకు ఢిల్లీలోని పలు తెలుగు సంఘాలు సంఘీభావాన్ని తెలిపాయి.
అదే సందర్భంలో పార్లమెంటులో ఆందోళన చేస్తున్న టిడిపి ఎంపిల్లో రాజమండ్రి ఎంపి మురళీ మోహన్ అస్వస్తతకు గురయ్యారు. మురళీ మోహన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
అంతుకుముందు అనకాపల్లి టిడిపి ఎంపి అవంతీ శ్రీనివాస్ కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.