New Year Celebrations : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసేందుకు క్యూ కట్టిన ఎమ్మెల్యేలు...
వైసిపి నాయకులు, అధికారులతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అర్చకులు కూడా సీఎం జగన్ ను కలిసారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎంకు వేదాశీర్వచనం అందించారు.
![YCP MLAs meet CM YS Jagan and extend New Year wishes AKP YCP MLAs meet CM YS Jagan and extend New Year wishes AKP](https://static-ai.asianetnews.com/images/01hk249cppceh152th7r7mswze/whatsapp-image-2024-01-01-at-12-45-10-pm-jpg_363x203xt.jpg)
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యంమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వైసిపి నేతలు క్యూ కట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, వైసిపి నేతలు సీఎం జగన్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక ప్రభుత్వ ఉన్నతాధికారులు సైతం సీఎం జగన్ తో కేక్ కట్ చేయించి న్యూఇయర్ విషెస్ తెలిపారు. సీఎస్ జవహర్ రెడ్డి, డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి లతో పాటు సీఎంవో, సచివాలయ ఉన్నతాధికారులు సీఎంను కలిసి నూతన సంవత్సర వేడుకలు జరిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అర్చకులు కూడా సీఎం జగన్ ను కలిసి వేదాశీర్వచనం అందించారు. టిటిడి అర్చకులు స్వామివారి శేషవస్త్రాలు, లడ్డూ ప్రసాదంతో పాటు నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ను జగన్ కు అందించారు. అలాగే దుర్గగుడి ఆలయ ఛైర్మన్ కర్నాటి రాంబాబు అర్చకులతో పాటు సీఎంను కలిసారు. విజయవాడ ఆలయ నూతన క్యాలెండర్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమ్మవారి చిత్రపట్టాన్ని సీఎం జగన్ కు అందించి ఆశీర్వదించారు అర్చకులు.
ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి జోగి రమేష్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రిని కలిసారు.ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు,వెలంపల్లి శ్రీనివాస్, కైలే అనిల్ కుమార్,ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తదితరులు సీఎంను కలిసారు. సీఎం జగన్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నాయకులు.
సీఎం జగన్ ను కలిసిన తర్వాత విజయవాడ ఎమ్మెల్యేలు, నాయకులు మీడియాతో మాట్లాడారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు సీఎం ను కలిసామని... ఎలాంటి రాజకీయాలు ప్రస్తావనలోకి రాలేదని ఎమ్మెల్యే వెల్లంపల్లి తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసిపి గెలిచి సీఎంగా మళ్లీ జగనే వుండాలని... ఈ కొత్త సంవత్సరంలో ఆయనకు మరింత బలం చేకూరాలని కోరుకుంటున్నానని వెల్లంపల్లి తెలిపారు.
Also Read New Year Celebrations: తెలుగువారికి ప్రముఖుల శుభాకాంక్షలు
మరో ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు, నాయకుల కంటే ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పబలం జగన్ కు చాలా ఎక్కువని అన్నారు. పేదలకోసం ప్రతినిత్యం కష్టపడుతున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. 175 సీట్లు టార్గెట్ గా పెట్టుకున్న సీఎం జగన్ ప్రజల ఆశీర్వాదం ఉంటుందని మల్లాది విష్ణు అన్నారు.
ప్రత్యర్థులు, శత్రువులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా సంక్షేమం విషయంలో సీఎం జగన్ వెనకడుగు వేయడం లేదని దేవినేని అవినాష్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంతమంది ఏకమైనా వైసిపిని ఓడించలేరని... మళ్లీ రాష్ట్రానికి జగన్ సీఎంగా కావడం పక్కా అని అవినాష్ పేర్కొన్నారు.