పవన్ కు తెలియదు, బాలకృష్ణ బాబుకు సైగ చేసి ఉంటే..: రోజా
జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కు జీవోల గురించి తెలియదని, బాలకృష్ణను రాయలసీమ నుంచి తరిమికొడుతారని రోజా అన్నారు.
అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మీద, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడారు.
పవన్ కల్యాణ్ కు జీవోల గురించి తెలియదని ఆమె అన్నారు. చీకటి జీవోలంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు. మూడు రాజధానులకు అనుగుణంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారని ఆమె చెప్పారు.
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు బాలకృష్ణ సైగ చేసి బుద్ధి చెప్పి ఉంటే బాగుండేదని రోజా అన్నారు. రాయలసీమ నుంచి చంద్రబాును, బాలకృష్ణను తరిమికొట్టే రోజు వస్తుందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. పెద్దల సభకు పెద్దలను తీసుకు రాకుండా దద్దమ్మలను తీసుకుని వచ్చారని ఆమె అన్నారు.
చంద్రబాబు భజనపరులే మండలిలో ఉన్నారని, వారు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఆమె అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎమ్మెల్యేగా గెలువలేరని ఆమె అన్నారు. లోకేష్ రాజకీయ భవిష్యత్తు సమాధి అవుతుందని ఆమె అన్నారు. అందుకే మండలి రద్దును చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆమె అన్నారు.