జాబ్ మేళాలపై ఎంఎల్ఏ దృష్టి
- నగిరి వైసిపి ఎంఎల్ఏ ఆర్ కె రోజా ఆధ్వర్యంలో జరిగిన జాబ్ మేళా సక్సెస్ అయ్యింది.
నగిరి వైసిపి ఎంఎల్ఏ ఆర్ కె రోజా ఆధ్వర్యంలో జరిగిన జాబ్ మేళా సక్సెస్ అయ్యింది. ఉద్యోగాల్లో ఎంపికైన వారికి శుక్రవారం కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చాయి. ఇటీవలే పుత్తూరులోని ఎస్ఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో జరిగిన మేళాలో 41 కంపెనీలు పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ మేళాలో 5560 మంది నిరుద్యోగులు పాల్గొన్నట్లు రోజా ప్రకటించారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూలు తదితర ఫార్మాలిటీస్ అయిన తర్వాత 840 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసినట్లు రోజా చెప్పారు.
వరుణ్ మోటార్స్, లార్వెస్ట్ టెక్నాలజీస్, పోర్టియా సాఫ్ట్ వేర్ టెక్నాలజీస్, హెచ్ జిఎస్, అపోలో ఫార్మసి, పోలారిస్, ఫ్లిప్ కార్ట్, మెడ్ ప్లస్ తదితర కంపెనీలు ఉద్యోగుల ఎంపికలో పాల్గొన్నాయి. మూడు రోజుల్లో నియామకపత్రాలు ఇస్తామని చెప్పిన కంపెనీల ప్రతినిధులు శుక్రవారం మళ్ళీ పుత్తూరులో ఓ కార్యక్రమం నిర్వహించారు. గతంలో 840 మంది ఎంపికైనట్లు ప్రకటించినా మొత్తం మీద 1207 మందికి ఉద్యోగాల నియామకపు పత్రాలు ఇచ్చారని రోజా తెలిపారు.
ఈ జబ్ మేళా ఒకరకంగా ఎన్నికల సన్నాహాల్లో భాగమనే చెప్పాలి. మూడున్నరేళ్ళుగా ఎంఎల్ఏ హోదాలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ రోజా నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నారు. సమస్యలపై పోరాటాలు చేస్తునే ఉన్నారు. అయితే, అవి సరిపోవన్న విషయం అర్ధమైనట్లుంది. అందుకే వ్యక్తిగత ప్రయోజనాలు కల్పించే విషయంపైన కూడా దృష్టిపెట్టారు. ప్రతిపక్ష ఎంఎల్ఏ హోదాలో ప్రభుత్వం తరపున వ్యక్తిగత లబ్ది చేకూర్చే కార్యక్రమాలు చేసే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే, జనాలకు అందే ప్రతీ లబ్దిని అధికారపార్టీ నేతలే తమ ఖాతాలో వేసుకుంటారు. కాబట్టి తన పరిచయాలను ఉపయోగించి జాబ్ మేళాలు ఏర్పాటు చేశారనే అనుకోవాలి. ఏదేమైనా ప్రతిపక్ష శాసనసభ్యురాలయ్యుండి జాబ్ మేళాలు నిర్వహిస్తుండటం, సక్సెస్ చేయించిచటం గొప్పే కదా ?