బాబు సహా భూములు కొన్నోళ్లంతా జైలుకే: రోజా ఘాటు వ్యాఖ్యలు
అమరావతి కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ వైసీపీ ప్రభుత్వం కోరుతున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ప్రతిపక్ష టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
అమరావతి కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ వైసీపీ ప్రభుత్వం కోరుతున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ప్రతిపక్ష టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ఈ నేపథ్యంలో రాజధాని పేరుతో భూ కుంభకోణానికి పాల్పడిన టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన బినామీలు జైలుకెళ్లక తప్పదన్నారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్పర్సన్ రోజా.
మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆమె రాజధాని ప్రకటనకు ముందే చంద్రబాబుతో పాటు ఆయన బినామీలు వేలాది ఎకరాలు కొనుగోలు చేశారని ఆమె ఆరోపించారు.
చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు నారా లోకేశ్, బాలకృష్ణ, ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత సహా చాలా మంది టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారని రోజా ఆరోపించారు.
ప్రతి కుంభకోణంలోనూ స్టేలు తెచ్చుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని.. ఇప్పుడు ఏసీబీ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని రోజా ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇకనైనా స్టేలు తెచ్చుకోకుండా తన నిజాయితీని నిరూపించుకోవాలని ఆమె హితవు పలికారు.
మరో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ... రాజధానిలో భారీగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే విషయాన్ని మంత్రి వర్గ ఉప సంఘం కూడా నిర్ధారించిందని ఆయన గుర్తుచేశారు.
అమరావతి భూముల వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని, అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయని చెల్లుబోయిన అభిప్రాయపడ్డారు. బినామీ పేర్లతో టీడీపీ నేతలు రాజధానిలో భూములు కాజేశారని వ్యాఖ్యానించారు. చివరికి అసైన్డ్ భూములు, ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని కూడా ఉల్లంఘించారని వేణుగోపాల కృష్ణ ఆరోపించారు.