నన్ను టీడీపీ నేతలు ఒత్తిడికి గురిచేస్తున్నారు
ఆరోపిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే
టీడీపీ నేతలు తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారని విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఆరోపించారు. తనను టీడీపీలో చేరాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆదివారం తన స్వగృహంలో పలువురు పార్టీ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఇదివరకు కొంత మంది ఎమ్మెల్యేలను కొన్న టీడీపీ నాయకులు తనను కూడా కొనుగోలు చేయాలని నెలరోజులుగా తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని వెల్లడించారు. గత రాత్రి కూడా తనను సంప్రదించారని చెప్పారు. నేను చెప్పింది అవాస్తవమని టీడీపీ నాయకులు ఖండిస్తే బోసుబొమ్మ జంక్షన్లో బహిరంగంగా విషయాలన్నింటినీ వెల్లడిస్తానని స్పష్టం చేశారు.
టీడీపీలో చేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంలో తప్పేముందని ఎమ్మెల్సీ సంధ్యారాణి వ్యాఖ్యానించడాన్ని రాజన్నదొర తప్పుబట్టారు. భారత రాజ్యాంగంపై అవగాహన లేకుండా, ప్రజాప్రాతినిథ్య చట్టం గురించి తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.