సిఎం రమేష్ కు కౌంటర్: ఉక్కు ఫ్యాక్టరీ కోసం వైసిపి ఇలా..
కడపలో ఉక్కు కర్మాగారం స్థాపనలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ కు కౌంటర్ ఇవ్వడానికి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ సిద్ధపడింది.
కడప: కడపలో ఉక్కు కర్మాగారం స్థాపనలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ కు కౌంటర్ ఇవ్వడానికి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ సిద్ధపడింది. ఉక్కు కర్మాగారం సాధన కోసం ఈ నెల 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ బంద్ కు పిలుపునిచ్చింది.
ఉక్కు కర్మాగారంలో సిఎం రమేష్ ఒక్క రోజు దీక్ష చేసిన విషయం తెలిసిందే. దాంతో తెలుగుదేశం పార్టీకి మైలేజీ దక్కకుండా చేసేందుకు వైసిపి బంద్ కు పిలుపునిచ్చినట్లు కనిపిస్తోంది.
ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఈ నెల 23వ తేదీిన కడపలో, 24న బద్వేల్ లో, 25న రాజంపేటలో ధర్నాలు చేయనున్నట్లు వైసిపి నేత సజ్జల రామకృష్ణా రెడ్డి గురువారం ప్రొద్దుటూరులో ప్రకటించారు.
జమ్మలమడుగులో 26వ తేదీన ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు దీక్ష చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. 27వ తేదీన రహదారుల దిగ్బంధం, 29వ తేదీన రాష్ట్ర బంద్ చేపడుతామని ఆయన చెప్పారు.
అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో బిజెపి, టీడీపీలు ఉక్కు కర్మాగారం ఊసు కూడా ఎత్తలేదని ఆయన విమర్శించారు. బిజెపి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కడప ఉక్కు కర్మాగారం గురించి టీడీపీ మాట్లాడుతోందిని అన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే టీడీపి ఉక్కు కర్మాగారాన్ని డిమాండ్ చేస్తోందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన తప్పులను బిజెపిపైకి నెడుతున్నారని సజ్జల వ్యాఖ్యానించారు.