వైసిపి కార్యకర్త హత్య
ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ప్రధాన ప్రతిపక్షం వైసిపి నేతలపై అధికార టిడిపి దాడులు పెరిగిపోతున్నాయ్. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన ఘటనే అందుకు నిదర్శనం. అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు మళ్ళీ రెచ్చిపోయారు. కందుకూరు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త శివారెడ్డిని దారుణంగా చంపారు.
ఇటుకలపల్లి నుంచి కందుకూరుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శివారెడ్డిని టీడీపీ కార్యకర్తలు కాపుకాసి వేటకొడవళ్లతో నరికిచంపారు. పీర్ల పండగ సందర్భంగా కందుకూరులో ఇటీవల ఓ గొడవ జరిగింది. ఆ ఘటనను ఆసరాగా చేసుకొని టీడీపీ కార్యకర్తలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని భావిస్తున్నారు.
మంత్రి పరిటాలసునీత ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. శివారెడ్డి హత్య వెనుక పోలీసుల వైఫల్యం ఉందని అన్నారు. టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సీఐ రాజేంద్రనాథ్ పట్టించుకోలేదని తోపుదుర్తి మండిపడ్డారు. ఎన్నికలు దగ్గర కొచ్చే కొద్దీ ఇంకెన్ని దాడులు జరుగుతాయో ఏమో?