సెక్షన్ 30 కాపులను ఐక్యం చేస్తుందా?
నిర్భంధం కోసం వాడుకుంటున్న సెక్షన్ 30 చివరకు కాపులను ఐక్యం చేసేందుకు ఉపయోగపడుతుందేమో...
ఆంధ్రా కాపులు చిత్రమయిన రాజకీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
కాపులకు రిజర్వేషన్లను వాయిదా వేయడం కంటే, ఈ వర్గం ప్రజలు ఐక్యం కాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యల మీద కాపు నేతలు మండిపడుతున్నారు.
కొన్ని అగ్రకులాలు బిసి హోదా కావాలనడం, మరికొన్ని బాగా వెనకబడిన కులాలు ఎస్సి లేదా ఎస్ టి హోదా కావాలని డిమాండ్ చేయడం కొత్త కాదు. తమ డిమాండ్ల కోసం వాళ్లు ప్రదర్శనలు, దీక్షలు చేసిన సందర్భాలున్నాయి.రిజర్వేషన్లను వర్గీకరించాలని మాదిగలు చేసిన ఉద్యమం ఎంత ఉవ్వెత్తున సాగిందో మనకు తెలుసు .
అయితే, గతంలో ఏ కులం మీద ప్రయోగించని నిర్బంధాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తమ కులం మీద, తమ నాయకుల మీద ప్రయోగించడం ఏమిటో వాళ్లకి అర్థం కావడం లేదు. సహజంగా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్న కాపులు రిజర్వేషన్ల పేరుతో ఐక్యం వుతారని ముఖ్యమంత్రి భయపడుతున్నారా?
లేకపోతే, కాపుల రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా రాష్ట్ర మంతా సెక్షన్ 30 విధించడమేమిటి? ఎంతో శత్రవైఖరితో వుంటే తప్ప కాపు జనసమీకరణనే అడ్డుకోవాలనే అలోచన రాదని కాపు నేతుల మండిపడుతున్నారు. ఇది 2019 నాటికి ఒక కొత్త కాపు-ఐక్యతకు దారి తీసేలా ఉంది.
ఏ కుల ఉద్యమం మీద లేని అక్కసు ఒక కాపుల మీదే ఎందుకు అన్నది వారిని వేధిస్తున్న ప్రశ్న. ‘ఒక రాష్ట్రంలో నెలల తరబడి సెక్షన్ 30ను అమలుచేయడం దేశంలో ఎక్కడయినా ఉందా? కాపుల కోసమే ఈసెక్షన్ను ఉపయోగించడంలో అంతర్యం ఏమిటి, ’ అని ప్రశ్నిస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా కాపు జేఏసీ కన్వీనర్ వాసిరెడ్డి యేసుదాసు. రాజమహేంద్రవరం మాట్లాడుతూ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు ఇచ్చిన మూడు హామీలను నెరవేర్చాలన్న ముద్రగడ పద్మనాభం డిమాండ్ అంత ప్రమాకరమయినదా అని ఆయన ప్రశ్నించారు.
ఉక్కుపాదం మోపి , శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాన్ని పోలీసు బలగంతో అణచివేయాలని చూస్తున్నారని, అది సాధ్యం కాదని చెబుతూ 13 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో తమ వర్గీయులు ఐక్యం కావలసిన సమయం వచ్చిందని ఆయన పిలుపు నిచ్చారు. కాపుల కార్యచరణ పునరుద్ఘాటించారు.
‘డిసెంబర్ 18న ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ ప్రధాన కూడళ్లలో ఆకలి కేక కార్యక్రమం. ఇందులో మూతికి నల్లగడ్డలు కట్టుకుని గరిటె వాయించాలి. 30న 175 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందచేయాలి.
జనవరి 9, 2017, సాయంత్రం అన్ని ప్రధాన కూడళ్లల్లో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన జరపాలి. జనవరి 30న రావులపాలెం నుంచి అమలాపురం మీదుగా అంతర్వేదికి జరిగే ముద్రగడ సత్యాగ్రహ యాత్ర లో పాల్గొనాలి. యాత్రకు అనుమతి ఎవరూ అవసరం లేదని, మిగిలిన వారికి లేని అనుమతి తమ యాత్రకు అవసరం లేదని చెప్పారు.