టిడిపి ఓవర్ యాక్షన్ దేనికి సంకేతం?
- నంద్యాలలో రికార్డు స్ధాయిలో పోలింగ్ జరిగింది.
- ఈ విషయాన్ని గమనించిన టిడిపి నేతలు పలు చోట్ల జనాలు పోలింగ్ కు వెళ్ళకుండా అడ్డుకున్నారట.
- అయినా సాధ్యం కాలేదని సమాచారం.
- దాంతో ఓటర్లందరూ వైసీపీ వైపున్నారని టిడిపి నేతలు అనుకున్నట్లున్నారు.
- అందుకే మధ్యాహ్నం నుండి గొడవలు మొదలుపెట్టారు.
నంద్యాల ఉపఎన్నిక పోలింగ్ తర్వాత టిడిపి చాలా ఓవర్ యాక్షనే చేసింది. అందులోనూ చివరి మూడు గంటల్లో చాలా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అంత రచ్చ ఎందుకు చేసిందో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఉదయం నుండి ప్రశాంతంగానే పోలింగ్ జరిగింది. ఎక్కడా ఒక్క గొడవ కూడా లేదు. అటువంటిది చివరి మూడు గంటల్లో టిడిపికి ఏమైపోయింది? పోలింగ్ బూత్ ల్లో ఎక్కడ కూడా వైసీపీ ఓవర్ చేయలేదన్నది వాస్తవం. ఇంకా చెప్పాలంటే, టిడిపినే ఉదయం నుండి హల్ చల్ చేసిన విషయాన్ని అందరూ చూసారు.
ఇక్కడే ఓ విషయం గమనించాలి. ఉదయం నుండీ ఊహించినదానికన్నా పోలింగ్ చాలా ఎక్కవే జరిగింది. తెల్లవారి 6 గంటల నుండే చిన్నా, పెద్దా, ఆడ, మగ అన్న తేడా లేకుండా అందరూ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ ఎంత ఎక్కువ జరిగితే వైసీపీకి అంత విజయావకాశాలని విశ్లేషకులు ముందు నుండి అనుకుంటున్నదే.
దానికి తగ్గట్లే రికార్డు స్ధాయిలో పోలింగ్ జరిగింది. ఈ విషయాన్ని గమనించిన టిడిపి నేతలు పలు చోట్ల జనాలు పోలింగ్ కు వెళ్ళకుండా అడ్డుకున్నారట. అయినా సాధ్యం కాలేదని సమాచారం. దాంతో ఓటర్లందరూ వైసీపీ వైపున్నారని టిడిపి నేతలు అనుకున్నట్లున్నారు. అందుకే మధ్యాహ్నం నుండి గొడవలు మొదలుపెట్టారు.
టిడిపి నేతలు రచ్చ మొదలుపెట్టే సరికే గోస్పాడు, నంద్యాల రూరల్ మండలాల్లో భారీ పోలింగ్ నమోదైపోయింది. ఇక మిగిలింది నంద్యాల పట్టణమొక్కటే. అందుకే రచ్చ అంతా నంద్యాలలోనే జరిగింది. కాకపోతే ఇక్కడ కూడా అప్పటికే బాగా పోలింగ్ పూర్తయింది. టిడిపి నేతల్లో ఆ ఉక్రోషమే కనబడింది. దాదాపు రెండు నెలలు ఎంత కష్టపడినా, ఓటర్లను, సామాజిక వర్గాల్లోని ప్రముఖులను ఎంత మ్యానేజ్ చేసినా, పదవులు, కోట్లాది రూపాయలతో ప్రలోభాలకు గురిచేసినా ఉపయోగం కనబడలేదన్న బాధ, ఉక్రోషంగా మారి వైసీపీ నేతలపై చూపారేమో అనిపిస్తోంది. ఇంతకీ ఇదంతా దేనికి సంకేతాలబ్బా?