మా ఫిర్యాదులపై ఏం చేశారు: పోలీసులను ప్రశ్నించిన బాబు
సీఎం జగన్ తప్పుడు విధానాలను సోషల్ మీడియాలో ప్రశ్నించినవారిపై కక్షగట్టి అక్రమ అరెస్టులు చేయడాన్ని టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.
అమరావతి:సీఎం జగన్ తప్పుడు విధానాలను సోషల్ మీడియాలో ప్రశ్నించినవారిపై కక్షగట్టి అక్రమ అరెస్టులు చేయడాన్ని టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.
సోషల్ మీడియాలో రాజకీయ పోస్టులను ఫార్వార్డ్ చేశారనే నెపంతో విశాఖకు చెందిన 70 ఏళ్ల నలంద కిషోర్ ను సీఐడీ పోలీసులు అక్రమ అరెస్ట్ చేయడం అమానుషమన్నారు. ఈ మేసేజ్ లో ఎక్కడా కూడ వ్యక్తిగత దూషణలు లేవన్నారు. వెంటనే కిషోర్ ను విడుదల చేయాలని ఆయన కోరారు.
కృష్ణా జిల్లా నందిగామకు చెందిన చిరుమామిళ్ల కృష్ణను కూడా సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారంటూ సీఐడీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆయనను కూడా తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మహిళా శాసనసభ్యులు ఆదిరెడ్డి భవానిని కించపరిచే పోస్టులు పెట్టారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో బీసీ మహిళా నేత పంచుమర్తి అనూరాధను కించపరుస్తూ పోస్టులు పెట్టారు. ఫిర్యాదు చేశారు. అయినా నెలలు గడుస్తున్నా పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.
also read:ఆయనేమైనా దేశ ద్రోహం చేశాడా: కిషోర్ అరెస్ట్ పై గంటా ఫైర్
రాజకీయ విమర్శల పోస్టును ఫార్వార్డ్ చేసిన వారిని అరెస్ట్ చేసి వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డ వైకాపా నేతలను అరెస్ట్ చేయకపోవడం చట్టాన్ని దుర్వినియోగం చేయడం కాదా? ఎందుకు వివక్ష చూపుతారని ఆయన అడిగారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కూడా ఏపీ పోలీసుల తీరుపై విమర్శలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
పోలీసులు వైసీపీ ఒత్తిళ్ల ప్రకారం కాకుండా చట్టబద్ధంగా వ్యవహరించాలి. ఇకనైనా జగన్ తన విధ్వంస విధానాలను విడనాడి కరోనా నివారణపై నిర్ధిష్ట చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.