ఆటోడ్రైవర్ భార్యపై కన్నేసిన వాలంటీర్.. అడ్డుగా ఉన్నాడని సైనెడ్ సూదులతో హత్య...
ఆటో డ్రైవర్ భార్యపై కన్నేసిన ఓ వార్డు వాలంటీర్ అతడిని దారుణంగా హతమార్చాడు. సైనెడ్ సూదులు గుచ్చి హత్య చేయించాడు.

అన్నమయ్య జిల్లా : ఆంధ్రప్రదేశ్ లో ఓ వాలంటీర్ వివాహితపై కన్నేసి ఆమె భర్త అయిన ఆటో డ్రైవర్ని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్లోని పీలేరులో వెలుగు చూసింది. బుధవారం కాస్త ఆలస్యంగా ఈ ఘటన బయటకు వచ్చింది. గత నెల 31వ తేదీన ఈ హత్య జరిగింది. అయితే గత నెల 28వ తేదీనే వాలంటీర్ను ఉద్యోగం నుంచి తొలగించినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగింది.
పీలేరు అర్బన్ సీఐ మోహన్ రెడ్డి దీనికి సంబంధించిన వివరాలను ఈ మేరకు తెలిపారు. సుధాకర్ (35) అనే వ్యక్తి పీలేరు మండలం కాకులారంపల్లె ఇందిరమ్మ కాలనీలో ఉంటున్నాడు. అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆటో డ్రైవర్ గా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సుధాకర్ మూడున్నర ఏళ్ల కిందట కువైట్ కి వెళ్ళాడు. భర్త లేకపోవడంతో పీలేరులోని ఆర్టీసీ నల్లగుట్ట ప్రాంతానికి చెందిన గ్రామ వాలంటీర్ కిషోర్ (32) సుధాకర్ భార్యతో పరిచయం పెంచుకున్నాడు.
భీమవరం రాళ్లదాడి : టీడీపీ మాజీ ఎమ్మెల్యే వెంకట శివరామరాజుకు విరిగిన పక్కటెముక
ఆమెకు మాయమాటలు చెబుతూ దగ్గరయ్యాడు. మూడు నెలల కిందట కువైట్ నుంచి భర్త సుధాకర్ తిరిగి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అతనికి వాలంటీర్ విషయం.. భార్య విషయం తెలిసింది. దీంతో ఆగ్రహానికి వచ్చిన అతను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వాలంటీర్ ను పిలిపించి, మందలించి పంపించారు. తమ సాన్నిహిత్యానికి అడ్డువస్తున్న సుధాకర్ ను తొలగించుకోవాలని కిషోర్ అనుకున్నాడు.
దీనికోసం తిరుపతికి చెందిన ఉమా, సునీల్, చందులతో కలిసి ప్లాన్ చేశాడు. తమ పథకంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సుధాకర్ మరణించాలని అనుకున్నారు. దీనికోసం ఆ ముగ్గురితో సైనెడ్ సూదులు కొనిపించాడు. సూదులు వేయడం కుదరకపోతే కత్తులతో పొడిచి చంపాలని పథకం వేశారు. అలా పథకం ప్రకారం ఆగస్టు 31వ తేదీన సుధాకర్ కూతురిని స్కూల్ దగ్గర దింపి పోతుండగా.. అతని దగ్గరికి వచ్చిన ముగ్గురు సైనేడ్ సూదులు అతనికి గుచ్చి పారిపోయారు.
కాసేపటికే సుధాకర్ మృతి చెందాడు. భర్త హఠాన్మరణంతో భార్య పోలీసులను ఆశ్రయించింది. అతనిని హత్య చేయడంలో వాలంటీర్ కిషోర్ హస్తం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేసింది. దీనిమీద పోలీసులు కేసు నమోదు చేసుకుని.. హత్యలో వాలంటీర్ హస్తం ఉందని తేల్చారు. ప్రస్తుతం కిషోర్ ను అరెస్టు చేశారు. అతనికి సహకరించిన మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే, కిషోర్ ను ఆగస్టు 28వ తేదీనే విధుల నుంచి తొలగించినట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి.