జాయింట్ కలెక్టర్ పెద్దమనసు: వృద్ధురాలి చేతిలో వెయ్యి పెట్టి.. క్షేమంగా ఇంట్లో దించి
విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ తన దాతృత్వం చాటుకున్నారు. కష్టంలో ఉన్న ఒక వృద్ధురాలిని చూసి చలించిపోయి... తక్షణమే కారు దిగి తన వద్ద ఉన్న రూ.1000 రూపాయలను ఆమె చేతిలో పెట్టారు
విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ తన దాతృత్వం చాటుకున్నారు. కష్టంలో ఉన్న ఒక వృద్ధురాలిని చూసి చలించిపోయి... తక్షణమే కారు దిగి తన వద్ద ఉన్న రూ.1000 రూపాయలను ఆమె చేతిలో పెట్టారు.
శుక్రవారం ప్రజలకు 50 శాతం రాయితీపై ఉల్లిపాయలు అందించేందుకు గాను ఆర్ అండ్ బీ రైతు బజార్ వద్ద విక్రయ కేంద్రాన్ని ప్రారంభించేందుకు జేసీ వెళ్లారు. జేసీ ఉల్లి విక్రయ కేంద్రాన్ని ప్రారంభించి తిరుగు ప్రయాణంలో భాగంగా కారు ఎక్కుతుండగా రోడ్డు పక్కనే ఓ ముసలి అవ్వ దీనావస్థలో కనిపించింది.
ఎటు వెళ్ళాలో తెలియక అటూ ఇటూ చూస్తోంది. పైగా తన కాలికి గాయం కూడా కావడంతో నడవడానికి ఇబ్బంది పడ సాగింది. ఇదంతా గమనించిన జేసీ కిషోర్ కుమార్ వెంటనే ఆ వృద్ధురాలి దగ్గరకు వెళ్ళి దగ్గరకు తీసుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఎవరు? ఎక్కడి నుంచి, ఎలా వచ్చావని ఆరా తీయగా "మాది దాసన్నపేట అని.. కరెంట్ ఆఫీస్ దగ్గర అని, పేరు నరసమ్మ అని బదులిచ్చింది". ఇక్కడికి ఎలా వచ్చావ్.. ఎందుకు వచ్చావ్ అని అడగగా ఆ అవ్వ సరిగా సమాధానం చెప్పలేక పోయింది.
దీనిపై స్పందించిన జేసీ వెంటనే వృద్ధురాలిని జాగ్రత్తగా తన ఇంటి వద్ద దించేయ్యాలని.. వైద్య సిబ్బందికి సమాచారం అందించి చికిత్స అందించాలని ఆదేశించారు.
ఆమె ప్రాథమిక వివరాలను నమోదు చేసుకొని.. ఆమెకు ధైర్యం చెప్పి అక్కడ నుంచి తన కార్యాలయానికి వెళ్లిపోయారు జేసీ. ఈ విషయం ఆ నోటా ఈ నోటా సోషల్ మీడియా దాకా వెళ్లడంతో నెటిజన్లు జేసీ కిశోర్ కుమార్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.