పథకం ప్రకారమే విశాఖలో మంత్రులపై దాడి... సంచలన విషయాలు వెల్లడించిన వైజాగ్ సీపీ
విశాఖ విమానాశ్రయంలో మంత్రులపై దాడికి సంబంధించి నగర పోలీస్ కమీషనర్ శ్రీకాంత్ సంచలన విషయాలు చెప్పారు. మంత్రులపై పథకం ప్రకారమే దాడి జరిగిందని... మంత్రి రోజా పీఏ, ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావులకు గాయాలు అయ్యాయని శ్రీకాంత్ తెలిపారు.
విశాఖలో మంత్రులపై పథకం ప్రకారమే దాడి జరిగిందన్నారు నగర పోలీస్ కమీషనర్ శ్రీకాంత్. మంత్రులు రోజా, జోగి రమేశ్ , విడదల రజనీ, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలపై ముందస్తు ప్లాన్తోనే ఉద్దేశ్యపూర్వకంగానే దాడి చేశారని అన్నారు. మంత్రి రోజా పీఏ, ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావులకు గాయాలు అయ్యాయని శ్రీకాంత్ తెలిపారు. దాడికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించామని సీపీ చెప్పారు. ఈ నెల 15న అనుమతి లేకుండా పవన్ ర్యాలీ చేశారని.. ర్యాలీకి అనుమతి లేదని పవన్కు డీసీపీ చెప్పారని శ్రీకాంత్ అన్నారు. పోలీసులపై జనసేన నేతల ఆరోపణలు అవాస్తవమని.. ఎయిర్పోర్ట్ దగ్గర ప్లాన్ ప్రకారమే మంత్రులపై దాడి జరిగిందని సీపీ వెల్లడించారు. దాడి ఘటనలో 100 మందిపై కేసులు నమోదు చేశామని శ్రీకాంత్ చెప్పారు.
మరోవైపు... విశాఖ విమానాశ్రయంలో దాడికి సంబంధించి అరెస్ట్ అయిన జనసేన నేతలు, కార్యకర్తలు శనివారం బెయిల్పై జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 61 మంది జనసేన నాయకులు, కార్యకర్తలను రూ.10 వేల పూచీకత్తుపై ఇటీవల కోర్ట్ విడుదల చేసింది. మిగిలిన 9 మంది నేతలపై మాత్రం తీవ్ర స్థాయి కేసు నమోదై వుండటంతో ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం ఈ 9 మందికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో వీరందరినీ ఈరోజు విశాఖ కేంద్ర కార్యాలయం నుంచి విడుదల చేశారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు భారీగా చేరుకుని సంఘీభావం తెలిపారు.
ALso REad:విశాఖ ఎయిర్పోర్టులో మంత్రులపై దాడి... జైలు నుంచి విడుదలైన 9 మంది జనసేన నేతలు
ఇదిలా ఉండగా, విశాఖ విమానాశ్రయం వద్ద మంత్రులు, వైసీపీ నాయకులపై జరిగిన దాడి కేసులో జనసేన నాయకులను అక్టోబర్ 17న పోలీసులు అరెస్టు చేశారు. జనసేన నాయకులను బాధ్యులను చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. కోన తాతారావు, పీతల మూర్తి యాదవ్, విశ్వక్ సేన్, సుందరపు విజయ్ కుమార్, పంచకర్ల సందీప్, శివప్రసాద్ రెడ్డి, పివిఎస్ఎన్ రాజు, శ్రీనివాస్ పట్నీయక్, కీర్తీస్, పాలవసల యశస్విని, గేదెల చైతన్య, పట్టిమ రాజును పోలీసులు అరెస్టు చేశారు.