విశాఖ ఎయిర్పోర్టులో మంత్రులపై దాడి... జైలు నుంచి విడుదలైన 9 మంది జనసేన నేతలు
విశాఖ విమానాశ్రయంలో మంత్రులపై దాడికి సంబంధించి అరెస్ట్ అయిన జనసేన నేతలు, కార్యకర్తలు శనివారం బెయిల్పై విడుదలయ్యారు. వీరందరికి జనసేన కేడర్ ఘనస్వాగతం పలికింది.
విశాఖ విమానాశ్రయంలో వైసీపీ మంత్రులు జోగి రమేశ్, రోజా, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలపై దాడులకు సంబంధించి అరెస్ట్ అయిన జనసేన నేతలు, కార్యకర్తలు శనివారం బెయిల్పై జైలు నుంచి విడుదలయ్యారు. మొత్తం 61 మంది జనసేన నాయకులు, కార్యకర్తలను రూ.10 వేల పూచీకత్తుపై ఇటీవల కోర్ట్ విడుదల చేసింది. మిగిలిన 9 మంది నేతలపై మాత్రం తీవ్ర స్థాయి కేసు నమోదై వుండటంతో ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం ఈ 9 మందికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో వీరందరినీ ఈరోజు విశాఖ కేంద్ర కార్యాలయం నుంచి విడుదల చేశారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు భారీగా చేరుకుని సంఘీభావం తెలిపారు.
ఇదిలా ఉండగా, విశాఖ విమానాశ్రయం వద్ద మంత్రులు, వైసీపీ నాయకులపై జరిగిన దాడి కేసులో జనసేన నాయకులను అక్టోబర్ 17న పోలీసులు అరెస్టు చేశారు. జనసేన నాయకులను బాధ్యులను చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. కోన తాతారావు, పీతల మూర్తి యాదవ్, విశ్వక్ సేన్, సుందరపు విజయ్ కుమార్, పంచకర్ల సందీప్, శివప్రసాద్ రెడ్డి, పివిఎస్ఎన్ రాజు, శ్రీనివాస్ పట్నీయక్, కీర్తీస్, పాలవసల యశస్విని, గేదెల చైతన్య, పట్టిమ రాజును పోలీసులు అరెస్టు చేశారు.
Also REad:వైసీపీ నాయకులపై రాళ్లదాడి ఘటన.. జనసేన నాయకులకు ఊరట, 61మందికి బెయిల్...
విమానాశ్రయంలో సిసిటివి ఫుటేజీ ఆధారంగా దాడికి ప్రయత్నించిన వారిని గుర్తించి సెక్షన్ 307తో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. మంత్రి రోజా, తదితర వైసిపి నాయకులు విమానాశ్రయానికి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు వారిని దూషించి, రాళ్లతోనూ, పార్టీ జెండా కర్రలతోనూ, పదునైన ఇనుప వస్తువులతోనూ దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అక్కడ ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం కూడా జరిగిందని తెలిపారు.