Nellore: ద‌మ్ముంటే 2024 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి స‌వాలు విసిరారు. ఆ పార్టీ నాయ‌కుడు నారా లోకేశ్ పై తీవ్ర‌ విమ‌ర్శ‌లు గుప్పించారు. 

Former Minister and Nellore City MLA Dr P Anil Kumar Yadav: వైఎస్సార్సీపీ నాయ‌కుడు, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్ మ‌రోసారి తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జ‌న‌సేన‌లపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ద‌మ్ముంటే ఆ రెండు పార్టీలు ఒంటరిగా పోటీ చేయాలంటూ స‌వాలు విసిరారు. రానున్న ఎన్నిక‌ల్లో తాము ఏ పార్టీతో పొత్తుపెట్టుకోమ‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు. 

వివ‌రాల్లోకెళ్తే.. ద‌మ్ముంటే 2024 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి స‌వాలు విసిరారు. ఆ పార్టీ నాయ‌కుడు నారా లోకేశ్ పై తీవ్ర‌ విమ‌ర్శ‌లు గుప్పించారు. గురువారం నాడు అనిల్ మీడియాతో మాట్లాడుతూ.. ఒంటరిగా పోటీ చేసే సత్తా లేని వారు ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారంటూ టీడీపీ, జ‌న‌సేన‌ల‌పై విమ‌ర్శ‌లు చేశారు. ద‌మ్ముంటే ఒంట‌రిగా పోటీ చేయాలంటూ స‌వాలు విసిరారు. రానున్న ఎన్నిక‌ల్లో తాము ఏ రాజ‌కీయ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోబోమ‌ని చెప్పారు. వైసీపీ పొత్తులకు వెళ్లదనీ, ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని పేర్కొన్న అనిల్ కుమార్ యాద‌వ్.. టీడీపీ, జనసేనలకు అలాంటి సత్తా ఉందా అని ప్రశ్నించారు.

టీడీపీ నాయ‌కుడు నారా లోకేశ్ రాష్ట్రవ్యాప్త యువ‌గ‌ళం పాదయాత్ర ముగియకముందే రాష్ట్రంలో టీడీపీ దుకాణం మూసేస్తుందని విమ‌ర్శించారు. లోకేష్ దెబ్బకు ఆ పార్టీ నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయనీ, పాదయాత్రతో టీడీపీకి వున్న కాస్త పరువు కూడా పోతోందని దుయ్యబట్టారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్‌ను రాష్ట్ర స్థాయి నాయకుడిగా చేశారని మండిపడ్డారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను కూడా ఆయ‌న టార్గెట్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్క మ్యాజిక్ ఫిగర్ స్థానం నుంచి అయినా పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ప్ర‌భుత్వంపై ఈ రెండు పార్టీలు చేస్తున్న విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న ఖండించారు. 

వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మెరుగైన పాల‌న అందిస్తున్న‌ద‌ని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, గతంతో పోలిస్తే యువతకు అపార ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందని, ధైర్యంగా నాయకులను ప్రజల్లోకి పంపగల ఏకైక సీఎం జగన్ మోహ‌న్ రెడ్డి అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ అన్నారు.

జాబ్ క్యాలెండ‌ర్.. ఉచిత బ‌స్ పాస్.. 

అంత‌కుముందు టీడీపీ నాయ‌కుడు నారా లోకేశ్ మాట్లాడుతూ.. ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. టీడీపీ అధికారంలోకి రాగానే 2025 జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఆయ‌న హామీ ఇచ్చారు. యువ‌గ‌ళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ ఇర్రంగారిపల్లిలో చంద్రగిరి యువకులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం అధికారంలోకి వస్తే పీజీ వరకు ఉచిత బస్ పాస్ ఇస్తామన్నారు. విద్యా దీవెనను రద్దు చేసి నేరుగా కాలేజీలకు ఫీజులు చెల్లిస్తామనీ, రాష్ట్ర బోర్డు సిలబస్ ను కేజీ నుంచి పీజీకి పూర్తిగా మార్చి విద్యలో సమూల మార్పులు తీసుకొస్తామని తెలిపారు. న్యాయవ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలను నొక్కిచెప్పిన ఆయన న్యాయవ్యవస్థకు సౌకర్యాలు పెంచుతామని చెప్పారు. కోర్టు కాంప్లెక్స్ నిర్మాణాన్ని ముఖ్య‌మంత్రి జగన్ మోహ‌న్ రెడ్డి అడ్డుకున్నారని లోకేశ్ ఆరోపించారు.