వైసిపి నేతల దోపిడీపై విజిలెన్స్ విచారణ..: మాజీ మంత్రి ఆనంద్ బాబు డిమాండ్
అన్నదాతల కోసం అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ చెప్పిన రూ.3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? అని మాజీ మంత్రి ఆనంద్ బాబు ప్రశ్నించారు.
గుంటూరు: వైసీపీ ప్రభుత్వం రైతులను నిలువునా దగాచేస్తూ రైతు అనుకూల ప్రభుత్వమని ప్రచారం చేసుకుంటోందని మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చెప్పిన రూ.3వేలకోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? అని మాజీ మంత్రి ప్రశ్నించారు.
''గుంటూరు జిల్లాలో జొన్న, మొక్కజొన్న కొనుగోళ్లలో అధికార పార్టీ చేతివాటం ప్రదర్శిస్తోంది. వైసిపి ఎమ్మెల్యేలే స్వయంగా తమ అనుమాయులు, అనుచరులను దళారులుగా మార్చి రైతులను దోచుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం జొన్నకు రూ.2,600 గిట్టుబాటు ధర ప్రకటిస్తే రాష్ట్రంలో మాత్రం కేవలం రూ.1800లకే కొంటున్నారు'' అని ఆరోపించారు.
''ఇప్పటివరకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా జొన్న, మొక్కజొన్న కేవలం 22శాతం మాత్రమే కొన్నారు. రైతుల ఉత్పత్తులను కల్లాల్లోనే కొంటామన్న ప్రభుత్వం ఎన్ని క్వింటాళ్లను, ఎక్కడ కొన్నదో చెప్పాలి. వైసీపీ నేతల దోపిడీపై, రైతులకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వం తక్షణమే విజిలెన్స్ విచారణకు ఆదేశించాలి'' అని ఆనంద్ బాబు డిమాండ్ చేశారు.
read more రాబోయే రోజుల్లో... రాష్ట్ర పరిస్థితి మరింత దారుణ స్థితికి: యనమల ఆందోళన
మరో మాజీ మంత్రి జవహనర్ కూడా సీఎం జగన్ అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా కేవలం ఇసుకలోనే మరో రూ.10వేలకోట్ల దోపిడీకి ముఖ్యమంత్రి మాస్టర్ ప్లాన్ వేశాడని ఆరోపించారు. కాదేదీ కబ్జాకు అనర్హం... కాదేదీ దోపిడీకి అనర్హహమన్నట్లుగా జగన్ రెండేళ్ల పాలన సాగిందని... రాష్ట్ర ప్రజలకు రెండేళ్లలో 20రెట్లు కష్టాలు పెరిగాయని జవహర్ అన్నారు.
'' మంత్రుల పేరుతో ఉన్న బోర్డులు పెట్టుకొని మరీ ఇసుక లారీలు తిరుగుతున్నాయి. కడపకు చెందిన వ్యక్తులకు కొవ్వూరు, పోలవరంలో ఏం పని? జయప్రకాశ్ పవర్ వెంచర్స్ పేరుతో వైసీపీ నేతలే హోల్ సేల్ ఇసుక దోపిడీకి తెరతీశారు'' అని మాజీ మంత్రి ఆరోపించారు.
''18టన్నుల లారీకి రూ.12,150వరకు వసూలు చేస్తున్నారు. అంటే టన్ను ఇసుక రూ.375 అని చెప్పిందంతా అబద్ధమేనా? తక్షణమే ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలుచేయాలి. ఇళ్లు కట్టుకునేవారితో పాటు కట్టేవారిని కూడా ఏడిపిస్తున్నారు. రెండేళ్ల పాలనలో జగన్ ధనదాహానికి బలైన వర్గాల్లో భవననిర్మాణ కార్మికులు, రైతులు, దళితులే ముందున్నారు'' అని జవహర్ ఆరోపించారు.