జిల్లాకు రంగా పేరు... తలుచుకుంటే ప్రభుత్వాలే కూలడం ఖాయం...: వంగవీటి రాధ సంచలనం
దివంగత వంగవీటి మోహనరంగ పేరును కొత్తగా ఏర్పాటుకానున్న కృష్ణా జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రంగా తనయుడు రాధ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
విజయవాడ: దివంగత వంగవీటి మోహనరంగా (vangaveeti mohanaranga) ఒక్కజిల్లాకే పరిమితం కాదని... రాష్ట్రం మొత్తం ఆరాధిస్తుందని ఆయన తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంటవీటి రాధాకృష్ణ (vangaveeti radha) పేర్కొన్నారు. అలాంటి నాయకుడి పేరు కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాకు ప్రభుత్వమే పెట్టాల్సిందన్నారు. అంతేగానీ ఇప్పుడు తన తండ్రి పేరుతో జిల్లా ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్ని బ్రతిమాలే ప్రసక్తే లేదని రాధ పేర్కొన్నారు. రంగా గారి కొడుకుగా ఎవరినీ అభ్యర్ధించను... పెడితే మాత్రం ఆనందిస్తానని రాధ పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా (krishna district) విజయవాడ (vijayawada) శ్రీనగర్ కాలనీలో ఏర్పాటుచేసిన వంగవీటి రంగా కాంస్య విగ్రహాన్ని రాధ విష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనగర్ కాలనీకి పెద్దఎత్తున చేరుకున్న వంగవీటి అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా పేలుస్తూ రాధాకు స్వాగతం పలికారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో అధికార వైసిపి (ysrcp), ప్రతిపక్ష టిడిపి(TDP), జనసేన (Janasena), బిజెపి (bjp) నాయకులు పాల్గొన్నారు.
తండ్రి విగ్రహావిష్కరణ అనంతరం రాధ మాట్లాడుతూ... తన తండ్రిని కులమతాలకు అతీతంగా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారన్నారు. ఈ క్రమంలోనే శ్రీనగర్ కాలనీలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేసిన వారికి రాధ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం నలుమూలలా రంగా పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. రంగా అంటే పోరాటానికి దిక్సూచి, పేదల పాలిట పెన్నిధి... ఆయన చరిత్ర గురించి ప్రత్యేకంగా ఎవరూ చెప్పనక్కర్లేదని రాధ పేర్కొన్నారు.
''రంగా అభిమానులంతా ఏకమైతే ప్రభుత్వాలే కూలిపోవడం ఖాయం. ప్రస్తుతం చాలామంది రంగా శిష్యులు, అభిమానులు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. వారు కూడా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టేలా కృషి చేయాలి'' అని రాధ సూచించారు.
''నాకు ఏ పదవి, హోదా ఇవ్వని గౌరవం రంగా గారి అబ్బాయిగా దక్కింది. పదవులు ఐదేళ్లకు మారిపోవచ్చు కానీ రంగా కొడుకుగా ప్రజలు చూపించే అభిమానం అనంతం. ఈ జన్మకు రంగా కొడుకు అనే అదరణే నాకు సంతృప్తి'' అని వంగవీటి రాధ పేర్కొన్నారు.
ఇక ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నేత పోతిన మహేష్ మాట్లాడుతూ... వంగవీటి మోహనరంగా పేరు చెప్పుకోకుండా రాజకీయాలు చేయలేరన్నారు. ఏ పార్టీ అయినా, ఏ సామాజిక వర్గమైనా రంగా పేరు చెప్పుకునే పరిస్థితి వుందన్నారు. వంగవీటి మోహనరంగా కుల, మతాలకు అతీతంగా పేదల కోసం అండగా నిలిచారని... కాబట్టే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక నాయకుడు ఆయనని అన్నారు.
''రంగా తనయుడిగా రాధాకృష్ణ తండ్రి ఆశయాల కోసం పనిచేస్తున్నారు. గుండె నిండా అభిమానం నింపుకున్న వారంతా రాధా అడుగుజాడల్లో నిలవాలి. రాధాకృష్ణ ఎమ్మెల్యే కావడమే కాక, రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగాలని ప్రజలు కోరుకుంటున్నారు. జిల్లాల పునర్విభజన నేపధ్యంలో విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలి'' అని పోతిన మహేష్ ప్రభుత్వాన్ని కోరారు.
రాధా-రంగ మిత్ర మండలి అధ్యక్షులు చెన్నుపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ... వంగవీటి మోహనరంగా చనిపోయిన తర్వాత కోట్ల మంది అభిమానులు కళ్ల నీరు పెట్టారని గుర్తుచేసారు. రంగా ఒక శక్తి... అందుకే ఊరు వాడా స్వచ్ఛందంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. రంగాను చూడని నేటి తరం కూడా ఆరాధించడం గొప్ప విషయమన్నారు. ఈ జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని లక్షలాది మంది కోరుతున్నారు... ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నానని శ్రీనివాస్ పేర్కొన్నారు.