నగదు బదిలీ: వైఎస్ జగన్ మీద కేంద్ర మంత్రి ప్రశంసల జల్లు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కేంద్ర మంత్రి ఆర్కె సింగ్ ప్రశంసించారు. రైతులకు నగదు బదిలీ అమలు చేయాలనే జగన్ ఆలోచన ఎంతో ముందడుగు అని ఆర్కె సింగ్ కొనియాడారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద కేంద్ర విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి ఆర్.కె. సింగ్ ప్రశంసల జల్లు కురిపించారు. వినూత్నమైన ఆలోచనలతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించే సమర్థత జగన్మోహన్ రెడ్డికి ఉందని ఆయన అన్నారు. ప్రజలపై ఏ మాత్రం భారం పడకుడా కాపాడాలనే ఆలోచన అభినందనీయమని ఆయన అన్నారు.
సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్న ఏపీకి కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుదని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, గ్రీన్ ఎనర్జీ కార్పోరేషన్ లిమిటెడ్ సీఎండీ సాయిప్రసాద్ సోమవారం ఆర్కే సింగ్ తో ఢిల్లీ భేటీ ఆయ్యారు.
రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్తును ఇచ్చేందుకు సీఎం జగన్ చేస్తున్న కృషిని శ్రీకాంత్ కేంద్ర మంత్రికి వివరించారు. వ్యవసాయ సబ్సిడీని రైతు ఖాతాలో జమ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రైతులపై భారం పడకుండా చూస్తున్నట్లు ఆయన తెలిపారు.
నగదు బదిలీ విషయంలో వైఎస్ జగన్ నిర్ణయం సాహసోపేతమైందని, రైతులకు మేలు చేయాలనే ఆలోచన అభినందనీయమని ఆర్కె సింగ్ అన్నారు అన్ని రాష్ట్రాలకు జగన్ ఆదర్శంగా నిలిచారని అన్నారు ఏపీ ముందడుగును అన్ని రాష్ట్రాలకు వివరించి చెబుతామని ఆయన అన్నారు. ఇలాంటి డైనమిక్ ముఖ్యమంత్రి ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమని కేంద్ర మంత్రి అన్నారు.
రైతుల కోసం రా,్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి కేంద్రాల గురించి గ్రీన్ ఎనర్జీ కార్పోరేషన్ సీఎండి సాయిప్రసాద్ కేంద్ర మంత్రికి వివరించారు. ఈ ప్రాజెక్టు అవసరమైన సహాయం అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.