రైతులు ఇంకో రాష్ట్రంలో అమ్ముకుంటే అభ్యంతరం ఏంటీ: నిర్మల
ఎన్నికల హామీలను పూర్తిగా నిలబెట్టుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆలోచన చేస్తున్నారని అన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.
ఎన్నికల హామీలను పూర్తిగా నిలబెట్టుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆలోచన చేస్తున్నారని అన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. బుధవారం విజయవాడలో పర్యటించిన ఆమె రైతులు, వ్యవసాయ రంగం నిపుణులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్మలా మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందనేది తప్పుడు ప్రచారమన్నారు. మార్కెట్ కమిటీలను తొలగిస్తామని కాంగ్రెస్ చెప్పిందా లేదా అని ప్రశ్నించారు.
ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్లి కాయగూరలు, పళ్ళు అమ్ముకుంటే అభ్యంతరం ఏంటని నిర్మల నిలదీశారు. మార్కెట్ యార్డుల పన్ను, మధ్యవర్తుల పన్ను రైతులపై భారంగా ఉందని, కొత్త చట్టాలతో మార్కెట్కు వెళ్ళకుండానే సరుకు అమ్ముకోవచ్చని సీతారామన్ చెప్పారు.
కొత్త చట్టాలతో దళారులకే నష్టమని, రైతులకు కాదని ఆమె స్పష్టం చేశారు. కష్టపడి పంట పండించే రైతుకు మంచి ధర ఇవ్వాల్సిందేనని నిర్మలా తెలిపారు. అతి తక్కువ వర్ష పాతం ఉండే కచ్ ప్రాంతంలో ఎక్కువ హార్టికల్చర్ పండుతోందని, డ్రిప్ వల్లనే ఇది సాధ్యం అయ్యిందని కేంద్ర ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పార్టీ నేతలు సునీల్ దేవధర్, జీవీఎల్, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్ హాజరయ్యారు. ఐసోలేషన్లో ఉన్న కారణంగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.