యువతిపై మనసుపడ్డ ఇద్దరు స్నేహితులు.. అక్కసుతో పేస్టులో పటాస్ మందు కలిపి హత్యాయత్నం.. చివరికి...
ఒకే యువతితో ఇద్దరు స్నేహితులు ప్రేమలో పడ్డారు. అయితే ఆ యువతి మొదట ఒకరితో సన్నిహితంగా మెలిగి, ఆ తరువాత మరొకరితో స్నేహం చేసింది. దీంతో ఒకరి మీద ఒకరికి కక్ష పెరిగింది.
మచిలీపట్నం : ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు యువకులు.. ఒకరిపై ఒకరు కక్ష పెంచుకుననారు. చివరికి యువకుల మధ్య ప్రేమ వివాదం కొన్ని ప్రాణాలను బలి తీసుకునే ప్రయత్నానికి దారితీసింది. అయితే, అందుకు ప్రయత్నించిన యువకుడు ఆ విషయాన్ని తన సోదరుడికి చెప్పడంతో.. అతడు ఆ ప్రయత్నాన్ని భగ్నం చేసి ఎవరికీ ఎటువంటి హాని జరగకుండా చూశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో జరిగింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మచిలీపట్నంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన పాసపు నాగేంద్రకుమార్, వంకా నాగేశ్వరరావు స్నేహితులు, ఇద్దరు రోల్డుగోల్డు పనులు చేస్తుంటారు. ఒకే కాలనీకి చెందిన వారిరువురూ అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిపై మనస్సు పడ్డారు. సదరు యువతి మొదట నాగేశ్వరరావుతో చనువుగా మెలిగింది. అయితే, ఇటీవల నాగేంద్రకుమార్ తో మాట్లాడటం మొదలుపెట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన నాగేశ్వరరావు ఎలాగైనా నాగేంద్రకుమార్ ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
మూతబడిన స్కూల్ను ఇంటిగా మార్చేసుకున్న వైసీపీ నేత!.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు..
పథకం ప్రకారం సుమారు 15 రోజుల క్రితం తెలిసిన రోల్డుగోల్డు దుకాణంలో పటాస్ ముక్కను కొనుగోలు చేశాడు. మరుసటి రోజు తెల్లవారుజామున నాగేంద్రకుమార్ బాత్రూంలో ఉన్న టూత్ బ్రష్ పై నిందితుడు నాగేశ్వరరావు పటాస్ కలిపిన పేస్టు పెట్టి అక్కడినుంచి మెల్లిగా జారుకున్నాడు.
అయితే నాగేంద్ర కుమార్ ను అంతమొందించాలనుకుని ఈ పథకం వేసిన నాగేశ్వరరావు తాను చేసిన ప్రయత్నాన్ని తన సోదరుడికి చెప్పాడు. అది విన్న నాగేశ్వరరావు సోదరుడు షాక్ అయ్యాడు. అన్నను నేరస్తుడు కాకుండా చేయాలనుకున్నాడు. కొంతమంది ప్రాణాలు కాపాడాలనుకున్నాడు. వెంటనే పటాస్ కలిపిన పేస్ట్ పెట్టిన బ్రష్ లను అక్కడి నుంచి తీసి దూరంగా పడేసాడు. దీంతో ప్రమాదం తప్పింది.
కొన్ని రోజుల తర్వాత ఆ నోటా ఈ నోటా విషయం బయటికి పొక్కడంతో విషయం తెలుసుకున్న నాగేంద్రకుమార్ చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగేంద్రకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చిలకలపూడి పోలీసులు నాగేశ్వరరావును అరెస్టు చేసి, కోర్టుకు హాజరుపరచగా సొంత పూచీకత్తుపై విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.