రమణ దీక్షితులు చెప్పేవన్నీ అవాస్తవాలే
ఈఓ అనీల్ కుమార్ సింఘాల్ ఫైర్
తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు రమణ దీక్షితులు ఇటీవల కాలంలో చేసిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని టిటిడి ఈఓ అనీల్ కుమార్ సింఘాల్ అన్నారు. ఆయన మీడియాతో టిటిడి వివాదం, రమణ దీక్షితులు కామెంట్స్ పై మాట్లాడారు. ఆయన మాటల్లోనే చదవండి.
గత కొన్ని రోజులుగా శ్రీవారి కైంకర్యాలు ఆగమం ప్రకారం జరుగుతుందా లేదా..ఆభరణాలు సురక్షితం గా ఉన్నా యా లేదా. ఆలయంలో మరమ్మత్తు పనులు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అన్న అనుమానం భక్తులకు కలుగుతుంది..వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత టిటిడి పై ఉంది. 2013 జనవరిలో ప్రభుత్వ జిఓ నెం 1171, జిఓ ఎంఎస్. నెం 611ప్రకారం అర్చకులకు 65 సం రిటైర్మెంట్ ను ప్రభుత్వం వర్తింపజేసింది. జి.ఓ ప్రకారం ఏ.యస్ నరసింహ దీక్షితులు, భక్తవత్సల దీక్షితులు రామచంద్ర దీక్షితులను రిటైర్ చేశారు. 1956 టిటిడి సర్వీస్ రూల్స్ ప్రకారం టిటిడి లో పనిచేసే ఉద్యోగులు, అర్చకులందరు పదవీవిరమణ చేయాలని ఉంది. సర్వీస్ రూల్స్ ప్రకారమే నూతన ప్రధాన అర్చకుల నియామకాలు.
మిరాశి రద్దైయాక ప్రధాన అర్చక నాలుగు కుటుంబాల నుండి ఒక్కక్కరిని తీసుకున్నాము. ఇప్పుడు వంతులు లేకుండా అందరు కలసి ఉత్సవాలు,కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. మిరాశి అర్చకులకి గాని, బ్రాహ్మణులకు కానీ నష్టం జరగలేదు. శ్రీవారి ఆభరణాల భద్రత విషయంలో జస్టిస్ వాద్వ కమిటీ, జస్టిస్ జగన్నాధరావు కమిటీలు ఆభరణాలు సక్రమంగా ఉన్నాయని టిటిడి కి రిపోర్ట్ ఇచ్చాయి. అప్పట్లో ఆభరణాలు అన్ని సక్రమంగా ఉన్నాయని అర్చకులు కూడా రిజిస్టర్ లో సంతకం పెట్టారు. 1956 తిరువాభరణం రిజస్టర్ ప్రకారం విరాళం ఇచ్చిన వారి పేర్లు టిటిడి వద్ద లేవు. 2001 గరుడసేవ రోజున శ్రీవారి హారంలోని రూబీ డైమండ్ కనపడలేదని కొంతమంది అర్చకులు టిటిడి దృష్టికి తీసుకువచ్చారు. అప్పటి అధికారులు వెతకగా పగిలిన రూబీ డైమండ్ పీసులు ఇప్పటికి టీటీడీ వద్ద ఉన్నాయి. రూబీ డైమండ్ ను వేలం వేశారని రమణ దీక్షితులు చెప్తున్న మాటలు అవాస్తవం. ఆగమ సలహాదారులు ఒప్పుకుంటే శ్రీవారి ఆభరణాలను భక్తుల సందర్శనకు ఉంచేందుకు టిటిడి కి ఎటువంటి ఇబ్బంది లేదు.
మార్చి 1, 1979 నుంచి స్వామివారి కైంకర్యాలు అగమోక్తంగా సమయం ప్రకారం నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం. జీయర్ స్వాముల పర్యవేక్షణలో స్వామివారి కైంకర్యాలు యధావిధిగా జరుతున్నాయి. దేవాలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది. శ్రీవారి ఆలయంలో తవ్వకాలు జరుగుతున్నాయనేది అవాస్తవం. ఆలయం లో చిన్నచిన్న రిపేర్లు జరుగుతున్నాయి. అవి కూడా ఆగమ సలహదారుల సంప్రదింపుల తర్వాతే జరిగాయి. శ్రీవారి ఆలయంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ వస్తున్న ఆరోపణలు నన్ను భాదించాయి.