TSRTC: సంక్రాంతికి ఏపీకి బస్సుల సంఖ్య తగ్గించిన ఆర్టీసీ.. కారణాన్ని వెల్లడించిన సజ్జనార్
ఈ సారి సంక్రాంతి పండుగకు ఏపీకి బస్సుల సంఖ్యను తగ్గించినట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. మహాలక్ష్మీ స్కీం వల్లే బస్సుల సంఖ్యను తగ్గిస్తున్నట్టు వివరించారు.
![tsrtc reducing buses to andhra pradesh on sankranthi festival says md sajjanar due to mahalaxmi scheme kms tsrtc reducing buses to andhra pradesh on sankranthi festival says md sajjanar due to mahalaxmi scheme kms](https://static-ai.asianetnews.com/images/01hhahh7aatwgdc0bgrjj6zf90/ga1lu0cayaa7nfw-jpg_363x203xt.jpg)
Sajjanar: దసరా తెలంగాణలో దూం దాంగా చేసుకుంటారు. సంక్రాంతికి మాత్రం తెలంగాణ కంటే ఏపీలో ఎక్కువ క్రేజ్ ఉంటుంది. అందుకే.. సంక్రాంతి పండుగ అంటే హైదరాబాద్ నుంచి పెద్ద మొత్తంలో ఏపీ వాసులు వారి స్వగ్రామాలకు వెళ్లిపోతారు. అప్పుడు సహజంగానే ఆర్టీసీ బస్సుల సంఖ్య ఏపీకి పెంచుతారు. అదే విధంగా ప్రైవేట్ ట్రావెల్స్, ప్రైవేట్ వెహికిల్స్ పెద్ద మొత్తంలో అందుబాటులోకి వస్తుంటాయి. ఇవి అధికంగా చార్జీలు వసూలు చేస్తుంటాయి. అయితే, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా కీలక విషయాన్ని వెల్లడించారు.
ఈ సారి సంక్రాంతి పండుగ కోసం ఆంధ్రప్రదేశ్కు బస్సుల సంఖ్యను తగ్గించినట్టు వివరించారు. ఇందుకు ప్రధాన కారణం మహాలక్ష్మీ స్కీం అని తెలిపారు. మొత్తంగా 4484 ఆర్టీసీ బస్సులను సంక్రాంతి పండుగ కోసం ఆంధ్రప్రదేశ్కు వెళ్లడానికి అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఒక వేళ ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉంటే మరిన్ని బస్సులను అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఎంజీబీఎస్తోపాటు ఉప్పల్, ఎల్బీనగర్, జేబీఎస్ నుంచి ఈ స్పెషల్ బస్సులను ఏపీకి నడుపుతున్నామని పేర్కొన్నారు.
Also Read: AP News: ‘ఆడదాం ఆంధ్రా’లో.. కొట్టుకున్న విద్యార్థులు.. చిత్తూరు జిల్లాలోని కుప్పంలో రసాభాసగా పోటీలు
ఈ పండుగకు స్పెషల్ బస్సులనూ ఏర్పాటు చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ స్పెషల్ బస్సుల్లోనూ మహాలక్ష్మీ పథకం వర్తిస్తుందని, మహిళలు ఈ బస్సుల్లోనూ ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. రాష్ట్రంలో డిసెంబర్ 9వ తేదీ నుంచి మహాలక్ష్మీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.