చేతబడి చేశాడంటూ... గొడ్డలితో నరికి గిరిజనుడి దారుణ హత్య
చేతబడులు చేస్తున్నాడన్న అనుమానంతో గ్రామస్తులంతా కలిసి ఓ గిరిజనుడిని అతి దారుణంగా హతమార్చిన విషాద సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చేతబడులు చేస్తున్నాడన్న అనుమానంతో గ్రామస్తులంతా కలిసి ఓ గిరిజనుడిని అతి దారుణంగా హతమార్చారు. ఇలా గ్రామస్తుల ఆగ్రహానికి ఓ నిండు ప్రాణం బలయ్యింది.
ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా వేలేడు మండలం రామవరం ఊటగుంపు గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి రెండు నెలల క్రితం కామెర్ల వ్యాధితో మృతి చెందాడు. అయితే మృతుడు సురేష్ కి ఇదే గ్రామానికి చెందిన సీతారాముడు అనే వ్యక్తితో వైరం వుండేది. దీంతో అతడే చేతబడి చేసి సురేష్ మరణానికి కారణమని కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు అనుమానించారు.
అయితే ఇటీవల ఇదే గ్రామంతో దేవయ్య అనే మరో వ్యక్తి మృతిచెందాడు. అతడి పెద్దఖర్మ సమయంలో గిరిజనుల ఆచారం ప్రకారం పేతర ముంతలను మహిళలు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే మహిళలకు పూనకం వచ్చి గ్రామంలో చోటుచేసుకుంటున్న మరణాలకు సీతారాముడు చేస్తున్న చేతబడులేనని చెప్పారు. దీంతో గ్రామస్తులంతా ఆగ్రహంతో ఊగిపోయారు.
read more బ్రహ్మంగారు అలా అన్నది జగన్ బ్యాచ్ గురించే...: కళా వెంకట్రావు సెటైర్లు
దీంతో అర్థరాత్రి సమయంలో ఇంట్లో పడుకున్న సీతారాముడికి బయటకు లాక్కుని వచ్చి చితకబాదారు. అనంతరం కత్తులు, గొడ్డల్లతో అతడి మెడ నరికి దారుణంగా హతమార్చారు.
మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గ్రామస్తులను విచారించడమే కాదు... సీతారాముడిపై దాడి చేసినట్లుగా అనుమానిస్తున్న కొందరిని అదుపులోకి తీసుకున్నారు.