చంద్రబాబుకు షాకిచ్చిన ట్రాన్ స్ట్రాయ్
- పోలవరం కాంట్రవర్సీ మరో మలుపు తిరిగింది.
పోలవరం కాంట్రవర్సీ మరో మలుపు తిరిగింది. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఒకవైపు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, చంద్రబాబునాయుడు చెబుతున్న మాటలు ఉత్త డొల్లేనని తేలిపోయింది. తమకు నిధులు, అనుమతులు అన్నింటినీ ఇచ్చి తమనే కొనసాగిస్తే 2021 డిసెంబర్ కు ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ కాంట్రాక్టు పనులు చేస్తున్న ట్రాన్స్ ట్రాయ్ సంస్ధ తాజాగా ప్రకటించింది. తాజాగా ట్రాన్స్ ట్రాయ్ చేసిన ప్రకటనతో చంద్రబాబు, గడ్కరీలు ఇరుక్కున్నారు.
ఎలాగైనా పోలవరం పనులను పూర్తి చేసి వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగాలన్నది చంద్రబాబు ఆలోచన. అయితే, దానికి తగ్గట్లు పనులైతే కావటం లేదు. దాంతో కొద్ది రోజులుగా వివాదం ముసురుకున్నది. నిజానికి ప్రాజెక్టు పనులు చాలా రోజుల నుండి ఆగిపోయాయి. అయినా, పనులను 2018కి పూర్తి చేస్తామనే కేంద్రమంత్రి, చంద్రబాబు చెబుతుండటం గమనార్హం.
ఇటువంటి నేపధ్యంలోనే కేంద్రమంత్రికి కాంట్రాక్టు సంస్ధ ఓ ప్రతిపాదన అందచేసింది. ఆ ప్రతిపాదనలో ప్రాజెక్టు పనుల్లో జరిగిన జాప్యానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలే కారణమని ఎదరు ఆరోపించింది. ప్రాజెక్టు భూమిని అప్పగించటంలో 40 నెలలు జాప్యం జరిగిందన్నది ప్రధానమైన ఆరోపణ. భూమి ఎవరు అప్పగించాలి? రాష్ట్రప్రభుత్వమే కదా? భూమి అప్పగింతలో 40 నెలలు ఎందుకు జాప్యం జరిగిందో చంద్రబాబే సమాధానం చెప్పాలి. భూ అప్పగింతలో జాప్యం జరిగింది కాబట్టే పరిహారంగా 32 నెలల పొడిగింపు అడిగినట్లు సంస్ధ స్పష్టంగా చెప్పింది.
ఇక, డిజైన్లకు అనుమతులు ఇవ్వటంలో కేంద్రం కూడా స్పీడ్ గా పనిచేయలేదట. తాము పంపిన డిజైన్ల ఆమోదానికి కేంద్రం బాగా జాప్యం చేస్తోందని ఆరోపించింది. తాము అందించిన డిజైన్లను సకాలంలో ఆమోదిస్తే 2020, డిసెంబర్ కు ప్రాజెక్టు పూర్తవుతుందని లేకపోతే 2021, డిసెంబర్ కు కచ్చితంగా పూర్తి చేస్తామంటూ స్పష్టంగా చెప్పింది. ప్రతీ ఒక్కరూ పోలవరం ప్రాజెక్టు చేపట్టేందుకు ట్రాన్సా ట్రాయ్ కు తగిన సామర్ధ్యం లేదని మండిపడుతున్న నేపధ్యంలో ప్రాజెక్టు జాప్యానికి కారణం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలే అని సంస్ధ కొత్తగా ప్రకటించటం గమనార్హం.