తిరుమలలో టీటీడీ ఉద్యోగుల కోసం నేమ్ బ్యాడ్జ్ విధానం ప్రారంభం. భక్తులతో దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.

తిరుమల స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేల సంఖ్యలో దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తుంటారు. స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులకు టీటీడీ సిబ్బంది సేవలు చేస్తుంటారు. ముఖ్యంగా ఆలయంలోని క్యూలైన్లతో పాటుగా మిగిలినచోట్ల వారు విధులు నిర్వహిస్తుంటారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అయితే కొన్ని సందర్భాల్లో టీటీడీ సిబ్బంది భక్తుల విషయంలో దురుసుగా ప్రవర్తించారని,అమర్యాదగా వ్యవహరించారని సిబ్బంది విషయంలో చాలా ఫిర్యాదులు వచ్చాయి.ఈ క్రమంలో టీటీడీ ఓ ముఖ్య నిర్ణయం అమలు చేసేందుకు రెడీ అయ్యింది.ఇక నుంచి టీటీడీ ఉద్యోగులకు నేమ్‌ బ్యాడ్జ్‌ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఇంతకుముందే టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే.

నేమ్ బ్యాడ్జ్, ఐడీ కార్డులతో టీటీడీ ఉద్యోగుల విధులు నిర్వహిస్తున్నారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు నిర్ణయం, బోర్డు తీర్మానంతో తిరుమలలో నేమ్ బ్యాడ్జ్ ల విధానం అందుబాటులోకి తీసుకురాబోతుంది. ప్రస్తుతం టీటీడీ ఉద్యోగుల్లో కొందరికి మాత్రమే ఈ నేమ్ బ్యాడ్జ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆ తర్వాత మిగిలిన ఉద్యోగులకు కూడా నేమ్ బ్యాడ్జ్ విధానాన్ని అమలు చేస్తామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

దురుసుగా ప్రవర్తించే ఉద్యోగులపై…

కొంతమంది ఉద్యోగులు తిరుమలకు వచ్చే భక్తులతో సరిగా ప్రవర్తించడం లేదనే విషయం తన దృష్టికి వచ్చిందని.. భక్తులతో దురుసుగా ప్రవర్తించే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నేమ్ బ్యాడ్జ్‌ల ద్వారా అమర్యాదగా ప్రవర్తించే వారిని సులువుగా గుర్తించవచ్చని.. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల పట్ల టీటీడీ ఉద్యోగులు ఎంతో బాధ్యతగా వ్యవహరించాలన్నారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు అంకిత భావంతో సేవలందించడానికి ఈ నేమ్ బ్యాడ్జ్ విధానం ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. భక్తులతో దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించే ఉద్యోగులపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమన్నారు.