తస్మాత్ జాగ్రత్త... ఆ ఆరు జిల్లాలకు పొంచివున్న ప్రమాదం: విపత్తుల శాఖ హెచ్చరిక
ఏపీలోని పలు జిల్లాల్లో కేవలం వర్షాలు మాత్రమే కాకుండా పిడుగులు పడే ప్రమాదం వుందని విపత్తు నిర్వహణ శాఖ కమీషనర్ కన్నబాబు హెచ్చరించారు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే మూడు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు వెల్లడించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కేవలం వర్షాలుమాత్రమే కాకుండా పిడుగులు పడే అవకాశం కూడా వుందని తెలిపారు. మరీముఖ్యంగా ప్రకాశం, గుంటూరు, విశాఖ, విజయనగరం, కర్నూలు, అనంతపురం జిల్లాలో పిడుగులు పడే అవకాశాలున్నాయని కన్నబాబు హెచ్చరికలు జారీ చేశారు.
పిడుగులు పడే అవకాశాలున్న ప్రాంతాలు:
ప్రకాశం జిల్లా: ఎర్రగొండపాలెం, పెద్దరావీడు, త్రిపురాంతకము, దొనకొండ, మార్కాపురం, దోర్నాల, అర్ధవీడు, రాచేర్ల, పుల్లలచెరువు, కురిచేడు, కనిగిరి.
గుంటూరు జిల్లా: నూజెండ్ల, వినుకొండ, వెల్దుర్తి, మాచెర్ల, రాజుపాలెం.
విశాఖ జిల్లా: జీకె వీధి, చింతపల్లి, జి.మాడుగుల, కొయ్యూరు.
విజయనగరం జిల్లా: సాలూరు, మక్కువ.
కర్నూలు జిల్లా: డోన్, పత్తికొండ, మద్దికేర తూర్పు, వెల్దుర్తి
అనంతపురం: ఉరవకొండ, గుంతకల్లు, తలుపుల, పుట్టపర్తి, ఓబులదేవర చెరువు.
పైన పేర్కొన్న మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం అధికంగా ఉందని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని... సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని కన్నబాబు సూచించారు. మూడు రోజులపాటు జాగ్రత్తగా వుడాలని ప్రజలకు సూచించారు.