Asianet News TeluguAsianet News Telugu

స్పీకర్ పదవిని తాకట్టుపెట్టారు: తమ్మినేనిపై మాజీ మంత్రి జవహర్ ఫైర్

దేశ చరిత్రలో ఒక స్పీకర్ రాజకీయాలు మాట్లాడుతుంటే ప్రజలే నవ్వుకుంటున్నారని జవహర్ మండిపడ్డారు. తమ్మినేని తన ఉనికిని చాటుకునేందుకు  బాధ్యత గల హోదాను  జగన్‌కి తాకట్టు పెట్టి బహిరంగ ప్రకటనలు ఇవ్వటం సరియైనది కాదని అన్నారు. 

thammineni is degrading the respect of the constitutional post: jawahar
Author
Amaravathi, First Published Nov 8, 2019, 11:33 AM IST

ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేనిపై మాజీ  మంత్రి జవహర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగ విలువలకు, రాజకీయ విలువలకు నీళ్లొదిలారని అన్నారు.  ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌ పదవిని అనుభవిస్తున్న తమ్మినేని సీతారామ్‌కు మతిభ్రమించి ఏదేదో మాట్లాడుతున్నారని మాజీమంత్రి జవహర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 

దేశ చరిత్రలో ఒక స్పీకర్ రాజకీయాలు మాట్లాడుతుంటే ప్రజలే నవ్వుకుంటున్నారని మండిపడ్డారు. స్పీకర్‌ తన ఉనికిని చాటుకునేందుకు  బాధ్యత గల హోదాను  జగన్‌కి తాకట్టు పెట్టి బహిరంగ ప్రకటనలు ఇవ్వటం సరియైనది కాదని అన్నారు. 

అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుల్ని నువ్వు, నువ్వు అంటూ సంబోదించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ప్రెస్ మిట్లలో కూడా ,బయట సభల్లోనూ అలాగే విమర్శిస్తూ  స్పీకర్‌ హోదాను రోడ్డుపైకి లాగేసారని దుయ్యబట్టారు. రాజకీయాలు మాట్లాడాలని తమ్మినేని సీతారాంకు ఆరాటం ఉంటే తక్షణమే స్పీకర్‌ పదవికి రాజీనామా చేసి వైసీపీ అధికార ప్రతినిధిగా మారాలని డిమాండ్ చేశారు. 

జగన్ దగ్గర మెప్పుకోసంస్పీకర్‌ స్ధానాన్ని దిగజార్చటం సరికాదని హెచ్చరించారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులన్నీ కోర్టు పరిధిలో ఉన్నపటికీ స్పీకర్‌ స్ధాయిలో ఏదేదో  మాట్లాడటం సరియైనది కాదన్నారు. సభాసాంప్రదాయాలను మర్చిపోయి తమ్మినేని కేవలం.. ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు, వారి  కుటుంబంపై నిత్యం ఆరోపణలు చేయటం సరికాదన్నారు.

 ప్రజాప్రతినిధులమని చెప్పుకుంటూ.. తమ్మినేని చేస్తున్న విమర్శలు, ఆరోపణలు స్పీకర్‌ స్థాయినే దిగజారుస్తున్నాయి. అసెంబ్లీ నియమావళిని ఉల్లంగిస్తున్న  తమ్మినేనిపై గవర్నర్ కి పిర్యాదు చేయనున్నట్లు జవహర్ తెలిపారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలోనే అగ్రిగోల్డ్‌ కుంభకోణం జరిగిందనే విషయాన్ని ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు.

నిన్నఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అగ్రిగోల్డ్ విషయంలో గత ప్రభుత్వమే అవినీతికి పాల్పడిందని.. టీడీపీ అధినేత చంద్రబాబు పెద్ద మోసగాడని ఆరోపించారు. హాయ్‌ల్యాండ్ భూములును కొట్టేసేందుకు చంద్రబాబు, నారా లోకేశ్ ప్లాన్ వేశారని స్పీకర్ ధ్వజమెత్తారు.

ఎనిమిది రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ కంపెనీ మోసాలకు పాల్పడిందని.. అయితే బాధితులకు పరిహారం అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రపదేశే మాత్రమేనని తమ్మినేని స్పష్టం చేశారు.

హాయ్ ల్యాండ్ భూములను చంద్రబాబు తన కుమారుడి పేరిట రాసివ్వాలని ఒత్తిడి తెచ్చారని... ఈ వ్యవహారంలో సీఎం రమేశ్, యనమల రామకృష్ణుడు చక్రం తిప్పారని తమ్మినేని సీతారాం ఆరోపించారు.

Also Read:అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట: రేపటి నుంచి చెల్లింపులు.. జగన్ సర్కార్ నిర్ణయం

అగ్రిగోల్డ్ బాధితుల తిరుగుబాటు, పోరాటం కారణంగా అప్పటి ముఖ్యమంత్రి అడుగు ముందుకు వేయలేకపోయారని.. ఒక రకంగా హాయ్‌ల్యాండ్ ఆస్తుల్ని బాధితులే రక్షించుకున్నారని స్పీకర్ ప్రశంసించారు. 

తొలి కేబినెట్ సమావేశంలోనే జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ సమస్యపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి బడ్జెట్‌లో రూ.1,151 కోట్లు కేటాయించింది. దీనిలో భాగంగా గత నెల 18న రూ.263 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 3,69,000 మంది అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట లభించనుంది. 

అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు జగన్ ప్రభుత్వం తొలి బడ్జెట్ సమావేశాల్లోనే చర్యలు చేపట్టింది. బాధితులకు డబ్బు ఇవ్వడానికి వీలుగా ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో రూ.1150 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంలోంచి తాజాగా రూ.269.99 కోట్లు మంజూరు చేశారు. 

Also Read:రాజ్యాంగబద్దం కాదు...అయినా అగ్రిగోల్డ్ బాధితులకు సాయం...: అప్పిరెడ్డి

ఇప్పటికే రూ.10వేల లోపు డిపాజిటర్ల వివరాలను కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు. గుంటూరు జిల్లాలో 19,751 బాధితులకు రూ. 14,09,41,615లు, చిత్తూరుకు జిల్లాలో 8,257 మందికి రూ. 5,81,17,100 తూర్పుగోదావరి జిల్లాలో 19,545 మందికి  రూ. 11,46,87,619, పశ్చిమగోదావరి జిల్లాలో 35,496 మందికి రూ. 23,05,98,695, విజయనగరం జిల్లాలో 57,941 మంది బాధితులకు  రూ. 36,97,96,900, శ్రీకాకుళం జిల్లాలో 45,833 మందికి రూ. 1,41,59,741 మంది వున్నారు. 

అలాగే కర్నూలు జిల్లాలో 15,705 మందికి రూ. 11,14,83,494, నెల్లూరు జిల్లాలో 24,390 మందికి రూ. 16,91,74,466, కృష్ణా జిల్లాలో 21,444 మందికి రూ. 15,04,77,760, అనంతపురం జిల్లాలో 23,838 మందికి రూ. 20,64,21,009, వైయస్సార్‌ కడప జిల్లాలో 18,864 మందికి రూ. 13,18,06,875, ప్రకాశం జిల్లాలో 26,586 మందికిరూ. 19,11,50,904,  విశాఖపట్నం జిల్లాలో 52,005 మందికి రూ. 45,10,85,805  రూపాయలను తొలివిడతలో చెల్లించనున్నారు. మొత్తమ్మీద 3,69,655 మందికి రూ.263.99 కోట్లు చెల్లించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios