కోళ్ళ పందేలపై ఉత్కంఠ
గోదావరి జిల్లాలోని వీరవాసరం మండలంలో కోళ్ళ పందేలకు అనుకూలంగా భారీ ప్రదర్శన చేసారు.
మొత్తానికి అధికార-ప్రతిపక్షాలు ఒకటయ్యాయి. ఎందులోనంటారా? అదేలెండి కోళ్ళ పందేల విషయంలో. సంక్రాంతి పండుగ దగ్గర పడే కొద్దీ కోస్తా జిల్లాలు ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కోళ్ళ పందేల నిర్వహణకు పలువురు సిద్ధమవుతున్నారు. ఇంతలో కోడి పందేలను నిషేధిస్తూ హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
దాంతో నిర్వాహకులతో పాటు పందెంరాయళ్లలో కూడా కాక పుట్టింది. న్యాయస్ధానంపై పలువురు ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే గోదావరి జిల్లాలోని వీరవాసరం మండలంలో కోళ్ళ పందేలకు అనుకూలంగా భారీ ప్రదర్శన చేసారు.
ఈ ప్రదర్శనలో వైరిపక్షాలైన తెలుగుదేశం, వైసీపీ నేతలు ఒకటయ్యారు. అభివృద్ధి విషయంలో ఒకటైనా కాకపోయినా ఈ విషయంలో మాత్రం ఏకమయ్యారు.
న్యాయస్ధానం చెప్పినా, ఎవరు వద్దనా కోళ్ళ పందేలను నిర్వహించి తీరుతామంటూ ప్రదర్శనలో శపధాలు చేసారు. ఏడాదికి మూడు రోజుల జరిగే ఈ వేడుకను వద్దనేందుకు వీల్లేదంటూ నినాదాలు చేసారు. తమ ప్రదర్శనలో పందెం కోళ్ళతో సహా పాల్గొనటం గమనార్హం.
కోళ్ల పందేలను కోర్టు వద్దన్నది..ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనని అంటోంది. నిర్వాహకులు మాత్రం పందేలు జరపాల్సిందేనంటున్నారు. నిర్వాహకులు, పందెంరాయళ్ళకు మద్దతుగా ప్రజాప్రతినిధులందరూ ఏకమవుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో....మరి మీరు కూడా సిద్ధంగా ఉండండి... చూడ్డానికి