గాంధీ జయంతి రోజునా ఆగని గలీజ్ దందా... ఏపీలో పట్టుబడ్డ తెలంగాణ మద్యం
గాంధీ జయంతి రోజు కూడా ఆంధ్ర ప్రదేశ్ లో అక్రమ మద్యం ఏరులై పారుతుంది.
గుంటూరు: గాంధీ జయంతి రోజు కూడా ఆంధ్ర ప్రదేశ్ లో అక్రమ మద్యం ఏరులై పారుతుంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండల కేంద్రమైన శుక్రవారం ఉదయం ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 668 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు.
ఎడ్లపాడుకు చెందిన ముగ్గురు యువకులు అజయ్, రవికిరణ్, శ్రీరాములు గత కొద్ది రోజులుగా తెలంగాణ నుంచి మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఇలా అక్రమంగా సాగతున్న మద్యం విక్రయాల గురించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా దాడి చేశారు. ఈ దాడుల్లో 644 క్వార్టర్స్, 24 ఫుల్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు యువకులను అరెస్టు చేశారు పోలీసులు.
read more ఏకంగా ట్రాక్టర్లోనే...తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా మద్యం సరఫరా
ఇటీవల విజయవాడ దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలి కారులో కూడా ఇలాగే అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుబడింది. జగ్గయ్యపేటకు చెందిన చక్కా వెంకట నాగవరలక్ష్మీ కారులో భారీగా మద్యం వుందని పోలీసులకు సమాచారం అందడంతో దాడి చేసి కారులోని మద్యాన్ని స్వాదీనం చేసుకున్నారు.
ఈ క్రమంలో జగ్గయ్యపేట సీతారాంపురంలోని ఓ అపార్ట్మెంట్లో పార్క్చేసిన ఏపీ 16 బీవీ 5577 అనే నెంబర్ గల స్విఫ్ట్ కారులో అధికారులు మద్యం స్వాధీనం చేసుకున్నారు. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు.
అయితే ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఇప్పటి వరకు వరలక్ష్మీ భర్త, కారు డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన మద్యం తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీని విలువ రూ. 40 వేలు ఉంటుందని సమాచారం. ఈ వ్యవహారం కారణంగా వరతక్ష్మి తన పదవికి రాజీనామా చేశారు.