బాబాయ్ ఓ ఫైటర్... కరోనా మహమ్మారిని జయించి తిరిగి వస్తారు: రామ్మోహన్ నాయుడు
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి కరోనాకు పాజిటివ్ తేలిన సంగతి తెలిసిందే.
గుంటూరు: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి కరోనాకు పాజిటివ్ తేలిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు గుంటూరు రమేశ్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు.
''అచ్చెన్నాయుడు గారికి కరోనా పాజిటివ్ అని తేలింది. మా శ్రేయోభిలాషులు, పార్టీ వర్గాలూ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ మూడు నెలలుగా మీరిచ్చిన మద్దతుకు నా కృతజ్ఞతలు. ఆయన త్వరగా కోలుకోవాలని అందరం ప్రార్ధిద్దాం. నాకు తెలిసిన బాబాయ్ ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా నిబ్బరంగా ముందుకు సాగిపోతారు. ఇప్పుడు కూడా కోవిడ్ మహమ్మారిని జయించి వస్తారని గట్టిగా నమ్ముతున్నాను'' అంటూ టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.
ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఇటీవలే అచ్చెన్నాయుడిని అరెస్టయ్యారు. అయితే ఈ అరెస్టుకు ముందే ఆయనకు ఆపరేషన్ కావడంతో కోర్టు అనుమతితో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా అచ్చెన్నాయుడికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం అచ్చెన్నాయుడి ఆరోగ్యం బాగానే వుందని రమేశ్ ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు.
అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్ధితిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా స్పందించారు. అచ్చెన్నాయుడిపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఆపరేషన్ అయ్యిందని తెలిసి కూడా అచ్చెన్నను ఇబ్బంది పెడుతున్నారని లోకేశ్ మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరి వల్లే అచ్చెన్నాయుడు కరోనా బారిన పడ్డారని ఆయన ట్వీట్ చేశారు.
ఇక అచ్చెన్నాయుడికి కరోనా రావడానికి ప్రభుత్వమే కారణమని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తిని ప్రభుత్వం కనికరం లేకుండా దుర్మార్గంగా అటూఇటూ తరలించడం వల్లే అచ్చెన్నాయుడి ఆరోగ్యం దెబ్బతిన్నదన్నారు. రాజకీయ కక్షతోనే ప్రభుత్వం అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను వేధిస్తోందన్నారు. పాలకులు ఇప్పటికైనా బ్లీచింగ్ పౌడర్, పారాసిట్మాల్ అనే తమ మూర్ఖత్వాన్ని వదిలిపెట్టి కరోనా రోగులకు ఉత్తతమైన వైద్యసేవలందించాలని ఉమా హితవు పలికారు.