అప్పటి వరకు గడ్డం తీయను.. సీఎం రమేష్ ప్రతిజ్ఞ
తాను చేపట్టిన దీక్ష ఇంకా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికీ కేవలం ధ్రవ పదార్థాలు మాత్రమే స్వీకరిస్తున్నట్లు ఆయన వివరించారు.
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేంత వరకు తాను విశ్రమించనని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. సోమవారం ఉదయం ఆయన తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రమేశ్కు ఆలయ పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం రమేశ్ మీడియాతో మాట్లాడుతూ.. కడప ఉక్కు కర్మాగారం నిర్మాణం కోసం తలపెట్టిన దీక్షను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రేపు అనంతపురంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. కర్మాగారం నిర్మాణానికి పునాది వేసే వరకు గడ్డం తీయనని శపధం చేశారు.