పేదల ఇళ్లు.. గ్రాఫిక్స్ అనుకునేరు: విజయసాయిరెడ్డిపై బుద్దా సెటైర్లు
వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. శనివారం ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన... చంద్రబాబు గారు పేదల కోసం నిర్మించిన ఇళ్లను క్వారంటైన్ సెంటర్లు గా మార్చుకున్న మీ అల్లుడు గారిని అడగండి అడ్రెస్స్ చెబుతారు సాయిరెడ్డి గారు.
ఇక గ్రాఫిక్స్,స్మశానం అంటారా? మొన్నే మీ మంత్రి బొత్సా ఆ భవనాలు ఎక్కి గ్రాఫిక్స్ అనుకోని దూకబోతే,పోతారు ఆగండి అని పిఏ పట్టుకొని ఆపాడట.ఒక్క సారి మీరు ట్రై చెయ్యండి గ్రాఫిక్స్ అవునో,కాదో తేలిపోతుంది కదా! అంటూ సెటైర్లు వేశారు.
అంతకుముందు మరో ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో వైసిపి ఏడాది పాలన ట్రైలర్ మాత్రమే అంటున్న వీసారెడ్డి... అందులోని హైలెట్స్ ను కూడా వివరించి ఉంటే బాగుండేదని ఆయన ఎద్దేవా చేశారు.
''ఏటా రూ. 5వేల కోట్ల జే-ట్యాక్స్ దోపిడీ కోసం 4 రెట్లు పెంచిన మద్యం ధరలతో కొల్లేరైన పేదల కాపురాలు ట్రైలర్ లో కళ్ల ముందు కదలాడుతున్నాయి. అల్లుడికి అధిక రేట్లతో ఆంబులెన్స్ లు కట్టబెట్టి రూ. 307 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన మీ దురాశ తొలి ఏడాది ట్రైలర్ లోనే నగ్న దర్శనమిచ్చింది.
4 రెట్లు పెంచిన విద్యుత్ ఛార్జీలు.. కరోనా కష్టాల్లో ఉన్న ప్రజల మాడు పగులగొట్టి ఇచ్చిన కరెంట్ షాక్ ట్రైలర్ లో ప్రజల కళ్లు బైర్లు కమ్మేలా చేసింది'' అని అన్నారు. ''సిమెంట్-ఇసుక మొదలు రేషన్ సరుకుల వరకు ధరలు పెంచి.. ప్రజలపై మోపిన రూ. 50 వేల కోట్ల బాదుడుతో తేలిన వాతలు మీ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి.
తొలి ఏడాదే రూ. 87 వేల కోట్ల అప్పు చేసి సగానికి సగం దిగమింగిన మీ అవినీతి ఆకలి కూడా ట్రైలర్ లో కనిపించింది వీసారెడ్డి. మీరు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించిన మీడియా, ప్రతిపక్షం, ఎన్నికల కమిషనర్, ఉన్నత న్యాయస్థానాలు, చివరకు మీ పార్టీ ఎంపిపైన మీరు చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక దాడులు, పెడుతున్న అక్రమ కేసులు తొలి ఏడాది ట్రైలర్ నిండా జుగుప్సాకరంగా దర్శనమిస్తున్నాయి'' అని మండిపడ్డారు.