చంద్రబాబుకి లేఖ రాసి... ఆవేదనతో వెనక్కి తగ్గిన ఎమ్మెల్యే అనిత
తన ఆవేదననంతా లేఖలో పేర్కొన్న అనిత
టీడీపీ నేత ఎమ్మెల్యే అనిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల అనిత ను టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం) సభ్యురాలిగా చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. ఆమె నియామకాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేశారు. దీంతో.. ఈ విషయంపై అనిత చంద్రబాబుకి లేఖ రాశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్గా తన నియామకాన్ని వెనక్కు తీసుకోవాలంటూ సిఎం చంద్రబాబుకు రాసిన లేఖలో అనిత పేర్కొన్నారు. తన కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు రావడం తనకు ఇష్టం లేదని ఆమె పేర్కొన్నారు.తాను హిందువునని, తన ఇష్టదైవం వేంకటేశ్వర స్వామి అని ఆమె స్పష్టం చేశారు. తాను అనేకసార్లు తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకున్నానని చెప్పారు. తాను క్రిష్టియన్ను కాదన్నారు.
టీటీడీ మెంబర్గా అనితను నియమించిన వెంటనే సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. అనిత తనను తాను క్రిష్టియన్ అని ఆ వీడియోల్లో ప్రకటించుకున్నట్లు ఉంది. తాను దేవుడిని నమ్ముతానని, తన బ్యాగ్లో, కారులో బైబిల్ ఉంటుందని అనిత చెప్పినట్లు వీడియోలో ఉంది. దీంతో దుమారం రేగింది. తన కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు రావద్దని తాను కోరుకుంటున్నట్లు స్పష్టం చేసిన అనిత తన నియామకాన్ని వెనక్కు తీసుకోవాలని తన లేఖను చంద్రబాబును కోరారు.