సీఎం జగన్ పై మీ హీరోయిజం చూపించండం... అప్పుడే రీల్ కాదు రియల్ హీరోలు: యాక్టర్స్ కు టిడిపి ఎమ్మెల్యే చురకలు
సినీ పరిశ్రమను ఇబ్బందులకు గురిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై హీరోయిజం చూపించాలని టాలీవుడ్ హీరోలకు టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సూచించారు. జగన్ కు భయపడకుండా ఎదిరించి రీల్ లోనే కాదు రియల్ గా హీరోలమని నిరూపించుకోవాలని సూచించారు.
అమరావతి: సినీ రంగాన్ని సీఎం వైఎస్ జగన్ (ys jagan) వేధింపులకు గురి చేస్తుంటే సినీ పెద్దలు ఎందుకు నోరు మెదపటం లేదని టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ (anagani satyaprasad) నిలదీసారు. సినిమాల్లో చూపించే హీరోయిజం మీ సినీ పరిశ్రమను వేధింపులకు గురిచేస్తున్న జగన్ సర్కార్ (jagan government) పై ఎందుకు చూపించటం లేదంటూ ప్రశ్నించారు. మీరు రీల్ హీరోలుగానే మిగిలిపోతున్నారు తప్ప రియల్ హీరోలుగా మారరా అంటూ టాలీవుడ్ (tollywood) పెద్దలకు అనగాని చురకలు అంటించారు.
''ఏపీ (andhra pradesh)కి సినీ పరిశ్రమను ఆహ్వానిస్తూ విశాఖపట్నం (visakhapatnam)లో స్టూడియోల నిర్మాణానికి గత ప్రభుత్వం భూమి కేటాయించింది. అయితే ఆ భూమిని సినీ పరిశ్రమకు వైసీపీ ప్రభుత్వం అప్పగించకుండా ఇబ్బంది పెడుతున్నా మీరు నోరుమెదపడం లేదు. రాష్ట్ర రాజధాని (ap capital) అమరావతి (amaravati)పై ఇంత వివాదం జరుగుతుంటే మీరు మౌనంగానే ఉన్నారు. పొరుగు రాష్ట్రాల్లో కోవిడ్ (covid19) టైంలో చిన్న చిత్రాలకు పన్నులు తగ్గించారు... కానీ ఏపీలో తగ్గించకపోగా పన్నులు పెంచినా మీరు నోరుమెదపలేదు'' అని అనగాని గుర్తుచేసారు.
''కావేరి నదీ (kaveri river) జలాలు సమస్యపై తమిళ సినీ పరిశ్రమంతా (tamil film industry) ఏకతాటిపై వచ్చింది. జల్లికట్టు (jallikattu) అంశంపైనా తమిళ హీరోలంతా స్పందించారు. కానీ మన రాష్ట్రంలోని ప్రజల సమస్యలపైనే కాదు మీ సమస్యలపైనా ఎందుకు స్పందించటం లేదు? మీకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? సినీ పరిశ్రమ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని వారు సినీ ఇండస్ట్రీ (film industry)ని ఏం కాపాడుతారు? మా అసోషియేషన్ ప్రభుత్వంతో ఎందుకు చర్చలు జరపటం లేదు? ఇకనైనా తెలుగు సినీ పరిశ్రమ ఏకతాటిపైకి రావాలి'' అని టిడిపి ఎమ్మెల్యే సూచించారు.
read more జగన్ సర్కార్ గుడ్న్యూస్: సీజ్ చేసిన సినిమా థియేటర్ల రీ ఓపెనింగ్కి అనుమతి
''మీ సినిమాలు ప్రజలు చూడాలి కానీ వారి కష్టాలు మీకు పట్టవా? ప్రజా సమస్యలపై పొరుగు రాష్ట్రాల హీరోలకు ఉన్న చిత్తశుద్ది మీకు లేదా? జగన్ ని చూసి తెలుగు సినిమా హీరోలు భయపడుతున్నారా? మీరు ఇప్పటికైనా ప్రజా సమస్యలతో పాటు సినీ పరిశ్రమ సమస్యలపై నోరేవిప్పిమాట్లాడండి'' అని అనగాని సూచించారు.
''చేతకాని పాలనతో ఇప్పటికే విద్యారంగం, వ్యవసాయరంగం, పారిశ్రామిక రంగాలను నాశనం చేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చివరకు సినిమా రంగాన్ని కూడా వదలకుండా నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. సినిమా టికెట్ల దరలు, థియేటర్లలో తనిఖీల పేరుతో సినీ పరిశ్రమను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కోవిడ్ కారణంగా కొన్ని నెలల పాటు ధియేటర్లు మూతపడటం, నూతన సినిమాల చిత్రీకరణ ఆగిపోవటంతో సినీ కార్మికులపై తీవ్ర ప్రభావం నెలకొంది. ఇప్పుడు మళ్లీ జగన్ రెడ్డి ప్రభుత్వం కక్ష్యపూరితంగా ఇబ్బందులకు గురిచేస్తోంది'' అని ఆందోళన వ్యక్తం చేసారు.
''తనిఖీల పేరుతో థియేటర్లు మూసివేయటంతో అందులో పనిచేస్తున్న గేట్ మెన్ నుంచి ప్రొజెక్టర్ ఆపరేటర్ వరకు అనేక మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. రాష్ట్రంలో ఉన్న 1100 థియేటర్ల ద్వారా ప్రత్యక్షంగా 50 వేలమంది కార్మికులకు, పరోక్షంగా మరో 50 వేలమందికి ఉపాధి కలుగుతోంది. లక్షమందికి ఉపాధి కల్పిస్తున్న సినీ పరిశ్రమను జగన్ రెడ్డి తన వ్యక్తిగత స్వార్దం కోసం బలిపెడుతున్నారు'' అని ఆరోపించారు.
read more RRR movie: దానయ్యని కలిసిన డిస్ట్రిబ్యూటర్స్.. ఇలాగైతే కష్టమే, 50 నుంచి 70 కోట్ల లాస్ ?
''ప్రజలకు వినోదాన్ని అందించే సినీరంగ కార్మికుల బ్రతుకులను విషాదం చేసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఉచిత ఇసుక రద్దు చేసి వందలాదిమంది భవన నిర్మాణ కార్మికులను బలితీసుకున్నారు. ఇప్పుడు థియేటర్లు మూయించి వాటిలో పనిచేసే కార్మికులను బలితీసుకుంటారా? మీ ధన దాహానికి ఇంకెంత మంది బలికావాలి?'' అని నిలదీసారు.
''థియేటర్లలో ఇన్నాళ్లు లేని తనిఖీలు ఇప్పుడే గుర్తొచ్చాయా? ప్రజా సమస్యలు గాలికొదిలి తనిఖీల పేరుతో కలెక్టర్లను థియేటర్ల చుట్టూ తిప్పుతున్నారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ లేదు కాబట్టి థియేటర్లు కూడా ఉండకూడదు అన్నట్టుగా జగన్ రెడ్డి వైఖరి ఉంది. జగన్ రెడ్డి ఇకనైనా సినీ పరిశ్రమపై కక్ష్యపూరిత దోరణి వీడి ఆ పరిశ్రమను ప్రోత్సహించాలి'' అని టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సూచించారు.