జగన్ దెబ్బకు టీడీపీ విలవిల: ఏపీలో కీలక నేతలపై వరుస కేసులు
ఏపీ రాష్ట్రంలోని టీడీపీకి చెందిన నేతలపై వరుసగా కేసులు నమోదు కావడం చర్చకు దారితీస్తోంది
అమరావతి: ఏపీ రాష్ట్రంలోని టీడీపీకి చెందిన నేతలపై వరుసగా కేసులు నమోదు కావడం చర్చకు దారితీస్తోంది. కర్నూల్ జిల్లాకు చెందిన టీడీపీ నేత కేఈ ప్రతాప్పై నకిలీ మద్యం కేసు నమోదైంది. ఈ కేసు మర్చిపోకముందే మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు చంద్రబాబు సన్నిహితుల ఇళ్లపై ఐటీ సోదాలు ఆ పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి.
ఏపీ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు టీడీపీ డోన్ ఇంచార్జీ కేఈ ప్రతాప్ పై ఈ నెల 6వ తేదీన కేసు నమోదైంది. నకిలీ మద్యం కేసు నమోదైంది. కేఈ ప్రతాప్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరో వైపు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి ఇంటిపై ఐటీ శాఖాధికారులు సోదాలు నిర్వహించారు. అదే రోజున చంద్రబాబు వద్ద సుదీర్ఘకాలంపాటు పీఏగా పనిచేసిన శ్రీనివాస్ ఇంటిపై కూడ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. శ్రీనివాసులు రెడ్డి ఇంటిపై, శ్రీనివాసు ఇంటిపై ఒకే సమయంలో అధికారులు సోదాలు నిర్వహించారు. 38 గంటలకు పైగా శ్రీనివాస్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు.
read more నారాయణ, పత్తిపాటిలపై కేసు: బాబు మాజీ పీఎస్ ఇంట్లో రెండో రోజూ సోదాలు
అమరావతిలో భూముల కొనుగోలు వ్యవహరంలో టీడీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్టుగా వైసీపీ నేతలు ఆరోపించారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ వేదికగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరాలను ప్రకటించారు.
అమరావతిలో భూముల కొనుగోలు విషయంలో ఇప్పటికే సీఐడీ కేసు నమోదు చేసింది. 796 తెల్ల రేషన్ కార్డు దారులు అమరావతి ప్రాంతంలో భూములను కొనుగోలు చేసినట్టుగా సీఐడీ గుర్తించింది.ఈ వ్యవహరంలో మనీలాండరింగ్ జరిగిందని సీఐడీ అనుమానిస్తోంది.ఈ విషయమై దర్యాప్తు చేయాలని ఈడీకి లేఖ రాసింది.
ఈ విషయమై ఈడీ కేసు నమోదు చేసింది. మరో వైపు సీఐడీ శుక్రవారం నాడు మరింత దూకుడును పెంచింది. శుక్రవారం నాడు ఒక్క రోజే ఏడుగురిపై కేసులు పెట్టింది. మాజీ మంత్రులు పి. నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులపై కేసు నమోదు చేశారు.టీడీపీకి చెందిన కీలక నేతలపై వరుసగా కేసులు నమోదు కావడం, ఐటీ దాడులు చోటు చేసుకోవడంపై ఆ పార్టీకి చెందిన నేతలు కలవరానికి గురౌతున్నారు.
read more పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ఆఫీసులో ఐటీ సోదాలు
రాష్ట్రంలోని ఇప్పటికే పలువురు కీలక నేతలపై కేసులు నమోదయ్యాయి. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైసీపీ సర్కార్ పెట్టిన కేసుల కారణంగానే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకొన్నట్టుగా అప్పట్లో చంద్రబాబు విమర్శలు చేశారు.
అదే సమయంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ విప్ కూన రవికుమార్, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావులపై కేసులు నమోదయ్యాయి. యరపతినేని శ్రీనివాసరావుపై మైనింగ్ కేసును సీబీఐ విచారణకు ఇస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది.