విజన్ 2047... సంపద సృష్టించడం తెలిసిన చంద్రబాబుకే సాధ్యం..: యనమల
తెలుగుదేశం పార్టీ ఇటీవల జరిగిన మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టో వైసిపి నాయకుల్లో గుబులు రేపుతోందని మాజీ మంత్రి యనమల పేర్కొన్నారు.
గుంటూరు : విజన్ 2020 తో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలిపిన చంద్రబాబు నాయుడు అదేస్పూర్తితో విజన్ 2047 రూపొందించారని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. సంపద సృష్టించడం తెలిసినవారికే సంక్షేమం విలువ తెలుస్తుందని అన్నారు. అలా ముందుచూపుతో ఆలోచించి హైదరాబాద్ లో సంపదను సృష్టించిన చంద్రబాబు అమరావతిని అదే స్థాయికి తీసుకెళ్లాలని అనుకున్నారని తెలిపారు. సంపదను సృష్టించి పేదలను ధనికులుగా చేయగల సత్తా చంద్రబాబుకు వుందని యనమల అన్నారు.
రాజమండ్రి వేదికగా జరిగిన మహానాడులో భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో ప్రకటించిన మినీ మేనిఫెస్టో జగన్ రెడ్డి దుష్టపాలనకు ముగింపు పలకబోతోందని యనమల అన్నారు. టిడిపిని స్థాపించి ఎన్టీఆర్ సంక్షేమాన్ని ప్రారంభిస్తే చంద్రబాబు దాన్ని మరింత పెంచారన్నారు. ఇలా ప్రజాసంక్షేమం, రాష్ట్రాభివృద్ది, సామాజిక న్యాయంతో టిడిపి ముందుకు వెళుతుంటూ వైసిపి మాత్రం అప్పులు చేయడం, రాష్ట్రాన్ని దోచుకోవడానికే పాలన సాగిస్తున్నారని యనమల ఆరోపించారు.
టిడిపి విడుదలచేసిన మినీ మేనిఫెస్టోలో పేర్కొన్న మహాశక్తి పథకంతో మహిళల శక్తి మరింత పెరగనుందని మాజీ ఆర్థిక మంత్రి అన్నారు. గతంలో డ్వాక్రా సంఘాలను ప్రారంభించి మహిళాభివృద్ది చేసి చూపించింది చంద్రబాబేనని అన్నారు. ఇక రానున్న రోజుల్లో టిడిపి అధికారంలోకి రాగానే విద్యార్థులకు ఏడాదికి రూ.15000 చొప్పున అందిస్తామన్నారు. అలాగే ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు, నిరుద్యోగులకు రూ3వేల భృతి, రైతులకు రూ.20వేల సాయం అందించనున్నట్లు యనమల తెలిపారు.
Read More నా మనస్తత్వానికి సరిపడే ఏ పార్టీ అయినా ఒకే: కేశినేని నాని సంచలనం
తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను చూసి జగన్ రెడ్డి ముఠాకు ముచ్చెమటలు పడుతున్నాయని యనమల అన్నారు. జగన్ రెడ్డి దుష్టపాలనను అంతం చేసేందుకు వదిలిని మొదటి అస్త్రమే ఈ మినీ మేనిఫెస్టో అని అన్నారు. నవరత్నాల పేరిట జరిగిన నవ మోసాలకు గురయిన ప్రజలకు టిడిపి మేనిఫెస్టో భరోసా ఇస్తోందన్నారు.
వైసిపి ప్రభుత్వం ఓ చేత్తో అమ్మఒడి కింద రూ.13 వేలు ఇస్తూనే నాన్నబుడ్డి ద్వారా రూ.70వేలు కొట్టేస్తున్నారని యనమల ఆరోపించారు. అలాగే డ్రైవర్లకు రూ.10 వేలు ఇచ్చి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి, ఆర్టిఓ జరిమానాలు విధించి, మద్యం, కరెంటు చార్జీలు పెంచి అంతకంటే ఎక్కువే దోచుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో అమలుచేసిన 118 పథకాలను జగన్ రెడ్డి రద్దు చేసారని యనమల ఆందోళన వ్యక్తం చేసారు.