సారాంశం

విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.  తన  వ్యాఖ్యలను పార్టీ ఎలా తీసుకున్నా తనకు ఇబ్బంది లేదన్నారు.

విజయవాడ:  వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా  ఏ పిట్టల దొరకు  టిక్కెట్టు  ఇచ్చినా  తనకు  ఇబ్బంది లేదని టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.   విజయవాడ ఎంపీ  కేశినేని నాని  బుధవారంనాడు సంచలన వ్యాఖ్యలు  చేశారు. వచ్చే ఎన్నికల్లో  పార్టీ టిక్కెట్టు  ఇస్తుందా?  తాను  ఎంపీ అవుతానా? అనే భయం తనకు లేదన్నారు.  తన మనస్తత్వానికి  సరిపోతే  ఏ పార్టీ అయినా ఓకే అని  కేశినేని నాని  తేల్చి  చెప్పారు.  తన మాటలను పార్టీ ఎలా తీసుకన్నా తనకు  భయం లేదన్నారు. తనకు మంచి ట్రాక్ రికార్డు ఉందని  కేశినేని నాని  చెప్పారు.  తాను చేసిననన్ని పనులు దేశంలో  ఏ ఎంపీ కూడా చేయలేదని ఆయన  గుర్తు  చేశారు.   

 ప్రజలంతా  కోరుకుంటే  ఇండిపెండెంట్ గా  పోటీ చేస్తానేమోనని  నాని  వ్యాఖ్యానించారు. వైసీపీలోకి   కేశినేని నాని  వస్తానంటే  స్వాగతిస్తామని వైసీపీ ఎంపీ అయోధ్య రాంరెడ్డి  మీడియాతో  వ్యాఖ్యలు  చేసిన   రోజే విజయవాడ ఎంపీ  కేశినేని నాని  ఈ వ్యాఖ్యలు  చేయడం  ప్రాధాన్యత  సంతరించుకుంది.

2019  ఎన్నికల తర్వాత  అవకావశం దొరికినప్పుడల్లా  టీడీపీ పై  నాని  విమర్శలు  చేస్తున్నారు. పార్లమెంటరీ పార్టీలో  తనకు  కట్టబెట్టిన పదవులు కూడా వద్దని ఆయన తేల్చి చెప్పారు.   పార్టీలో  చోటు  చేసుకున్న పరిణామాలపై  కూడా  బహిరంగంగానే  వ్యాఖ్యలు  చేశారు. విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో  కేశినేని నానికి  ఇతర  నేతలకు మధ్య  ఉన్న విబేధాలు  మరింత బహిర్గతమయ్యాయి.  కేశినేని నాని  చంద్రబాబు  ర్యాలీలో  పాల్గొంటే తాము  దూరంగా ఉంటామని బుద్దా వెంకన్న ప్రకటించారు.   విజయవాడ పార్లమెంట్  నియోజకవర్గ పరిధిలోని  ఇతర  టీడీపీ నేతలతో  కూడ  నానికి  మధ్య గ్యాప్ నెలకొంది.

also read:కేశినేని నాని వైసీపీలోకి వస్తే స్వాగతిస్తాం: వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అయోధ్య రాంరెడ్డి

ఇటీవల కాలంలో  వైసీపీకి చెందిన  ప్రజా ప్రతినిధులపై  ఎంపీ   నాని ప్రశంసలు  గుప్పించారు.  అభివృద్ది కార్యక్రమాల్లో  అధికార, విపక్ష పార్టీల నేతలు కలిసి  పనిచేయాలన్నారు.   ఎన్నికల సమయంలోనే  రాజకీయాలు చూడాలని  కేశినేని  నాని  కోరారు. నందిగామ ఎమ్మెల్యే  జగన్మోహన్ రావు పై   కేశినేని నాని  ప్రశంసలు  కురిపించారు.  కేశినేని నానిపై ఎమ్మెల్యే  జగన్మోహన్ రావు  పొగడ్తలతో ముంచెత్తారు. ఈ పరిణామం  టీడీపీ శ్రేణులను  ఇబ్బందులకు గురి  చేసింది.  దీంతో  కేశినేని  నానిపై టీడీపీ  శ్రేణులు  సోషల్ మీడియాలో  విమర్శలకు పాల్పడింది.