వైసిపి అరాచకాలపై ప్రశ్నిస్తే... ఎస్ఈసీకి కోపమొస్తోంది...: వర్ల రామయ్య
కరోనా నిబంధనలు, ఎన్నికల నియమావళి చంద్రబాబునాయుడికి, టీడీపీవారికి మాత్రమే వర్తిస్తాయా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు.
అమరావతి: సీఎం జగన్ రెడ్డి ఆదేశాలతో డీజీపీ గౌతమ్ సవాంగ్ నాయకత్వంలోనే పోలీసులు మాజీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడిని నిర్బంధించారని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఆడుతున్న కుటిల, రాక్షసక్రీడలో భాగమే నేటి చంద్రబాబునాయుడి నిర్బంధమని...ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన నేడు చీకటిరోజన్నారు. జగన్మోహన్ రెడ్డి, డీజీపీ సవాంగ్, మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుట్రపన్ని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు.
''కరోనా నిబంధనలు, ఎన్నికల నియమావళి చంద్రబాబునాయుడికి, టీడీపీవారికి మాత్రమే వర్తిస్తాయా? నిన్న తిరుపతిలో ర్యాలీ నిర్వహించిన భూమన కరుణాకరెడ్డికి ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయనకు కరోనా సోకదా...చట్టాలు వర్తించవా? గతంలో చంద్రబాబునాయుడి కాన్వాయ్ పై దాడిజరిగితే భావప్రకటనా స్వేఛ్చ ఆర్టికల్19 అన్న డీజీపీ ఈ రోజు ప్రతిపక్ష నాయకుడి భావస్వేచ్ఛను ఎందుకు అడ్డుకున్నారు?'' అని నిలదీశారు.
read more ఎస్ఈసీ అఖిలపక్ష సమావేశం : వర్ల రామయ్యను బైటికి పంపేసిన నిమ్మగడ్డ..
''అధికారపార్టీ వారికి జీ హూజూర్ అనడమే రాష్ట్ర పోలీస్ శాఖ పనా? సవాంగ్ నాయకత్వంలో నిర్వీర్యమైన పోలీస్ శాఖ, ఆయన తర్వాత తిరిగి పట్టాలెక్కడానికి చాలా సమయం పడుతుంది. చంద్రబాబు నాయుడిని నిర్బంధించగలరు గానీ ఆయన ఆలోచనలను, ఆశయాలను నిలువరించగలరా? చంద్రబాబు నేలపైకూర్చుంటే తెలుగుజాతి కన్నీరు పెడుతోంది. ''డీజీపీ తక్షణమే స్పందించి చంద్రబాబునాయుడిని నిర్బంధంనుంచి విడిపించి, మాజీముఖ్యమంత్రికి బహిరంగంగా క్షమాపణచెప్పాలి'' అని వర్ల డిమాండ్ చేశారు.
''ఎన్నికల కమిషనర్ గవర్నర్ ను కలిసినప్పటినుంచీ మెత్తబడ్డాడు. ఈరోజు ఎస్ఈసీ నిర్వహించిన రాజకీయనేతల సమావేశం ఓ బూటకం, కంటితుడుపు చర్య. పంచాయతీ ఎన్నికల్లో అధికారపార్టీ అరాచకాలపై ప్రస్తావిస్తే ఎస్ఈసీ జీర్ణించుకోలేకపోయారు. సమావేశంలో టీడీపీ పట్ల ఎస్ఈసీ వ్యవహరశైలి అభ్యంతరకరం'' అని రామయ్య తెలిపారు.