జగన్ రెడ్డి ట్రాప్లో పడొద్దు.. జైలు పాలు కావొద్దు: అధికారులకు నారా లోకేష్ హితవు
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడొద్దని అధికారులకు సూచించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్. గీత దాటి ప్రవర్తిస్తున్న వారంతా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని ఆయన హెచ్చరించారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , ఎమ్మెల్సీ నారా లోకేష్. ఈ మేరకు శనివారం వరుస ట్వీట్స్ చేశారు. ‘‘ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులను జైలుకు తీసుకెళ్లాడు. తన హయాంలో ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్ లతో సహా పలువురు పోలీస్ అధికారులను జైలు పాలు చెయ్యబోతున్నాడు జగన్ రెడ్డి. కొంతమంది అధికారులు తాత్కాలిక ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి ట్రాప్ లో పడి కెరియర్ ని నాశనం చేసుకుంటున్నారు’’ అని ఎద్దేవా చేశారు.
‘‘ 41 ఏ నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్ట్ అంకబాబు గారిని ఎందుకు అరెస్ట్ చేశారంటూ సిఐడి అధికారుల పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే కోర్టు మొట్టికాయలు వేస్తున్నా అధికారులు తీరు మారడం లేదు ’’ అంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గీత దాటి ప్రవర్తిస్తున్న వారంతా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడంతో పాటు ఎందుకు తప్పు చేశాం అని జీవితాంతం బాధపడటం ఖాయమని ఆయన హెచ్చరించారు.
ALso REad:టీడీపీ రాగానే హెల్త్ యూనివర్సిటీకి మళ్లీ ఎన్టీఆర్ పేరు : తేల్చిచెప్పిన నారా లోకేష్
అంతకుముందు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారంపై నారా లోకేష్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మొదటి హెల్త్ యూనివర్సిటీని ఎన్టీఆర్ స్థాపించారని గుర్తుచేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ పెరు పెట్టారని లోకేశ్ తెలిపారు. జగన్ సీఎం అయ్యాక అన్నింటికీ పేర్లు మారుస్తున్నారని.. యూనివర్సిటీ నుంచి ప్రభుత్వం ఖర్చులు కోసం రూ.400 కోట్లు తీసుకుందని లోకేష్ ఎద్దేవా చేశారు. ఇంత రహస్యంగా ఎందుకు చేసారో ప్రజలు ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ పేరు ఎందుకు తొలగించారో ప్రభుత్వం చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు.
రాజశేఖర్ రెడ్డి, జగన్ యూనివర్సిటీకీ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. గతంలో ఇలాంటి రాజకీయాలు తమిళనాడులో ఉండేవని లోకేష్ గుర్తుచేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి పేర్లు మారిస్తే ఏమవుతుందని ఆయన నిలదీశారు. శాసనమండలిలో చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరించారని ఆయన దుయ్యబట్టారు. 9 బిల్లులు ఎలాంటి చర్చా లేకుండా ఏకపక్షంగా పూర్తి చేశారని.. టీడీపీ అధికారంలోకి రాగానే యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెట్టి తీరుతామని లోకేష్ స్పష్టం చేశారు.