ధైర్యంగా వుండండి.. అండగా వుంటాం : చెన్నుపాటి గాంధీని పరామర్శించిన నారా లోకేష్
ఇటీవల ప్రత్యర్థుల దాడిలో గాయపడ్డ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ పరామర్శించారు. అన్నివిధాలా పార్టీ అండగా వుంటుందని, అధైర్యపడాల్సిన అవసరం లేదని లోకేష్ ఆయనకు ధైర్యం చెప్పారు.
ఇటీవల ప్రత్యర్థుల దాడిలో గాయపడ్డ విజయవాడకు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీని మంగళవారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ పరామర్శించారు. గత వారం ప్రత్యర్థుల దాడిలో చెన్నుపాటి గాంధీ కంటికి గాయమైన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన తర్వాత విజయవాడలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో నారా లోకేశ్ మంగళవారం చెన్నుపాటి గాంధీని హైదరాబాద్లో పరామర్శించి, చికిత్స గురించి ఆరా తీశారు. అన్నివిధాలా పార్టీ అండగా వుంటుందని, అధైర్యపడాల్సిన అవసరం లేదని లోకేష్ ధైర్యం చెప్పారు.
మరోవైపు... చెన్నుపాటి గాంధీపై దాడి వ్యవహరంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దాడి అనంతరం చంద్రబాబు నాయుడు.. గాంధీ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ .. ఇది పిరికిపందల చర్య అని, ఓడిపోతామనే భయంతో వైసీపీ నాయకులు దాడికి పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.
Also Read:" ఖబడ్దార్.. మరోసారి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడితే సహించం"
ఇలాంటి దాడులు మరోసారి జరిగితే.. వదిలిపెట్టే సమస్య లేదని ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. గాంధీ కంటిపై పొడవడం దుర్మార్గపు చర్య అని.. ఈ దాడి ఘటనలో దుర్మార్గులకు శిక్ష పడే వరకు విడిచిపెట్టమనీ, సరైన న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చంద్రబాబు తెలిపారు. గతంలో ఇలాంటి ఘటనే జరిగిందనీ, విజయవాడలో టీడీపీ నాయకుడు పట్టాభిపై దాడి జరిగిన ఘటనను గుర్తుకు చేసుకున్నారు. ఆరోజు జరిగిన దాడికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే.. నేడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదనీ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని అధికార వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ అధినేత అన్నారు.
ఇదే పరిస్థితి మీ కుటుంబాలకు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని చంద్రబాబు అన్నారు. తమకు సొంత అజెండా లేదనీ, అమాయక ప్రజలకు జరుగుతున్న బాధితుల పక్షన నిలబడుతామని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ అరాచకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లామనీ, వారిలో చైతన్యం కలిగిస్తామన్నారు. ప్రతిఘటించి తిరుగుబాటు చేసే పరిస్థితి త్వరలో వస్తుందని.. దాడులు చేసే సంస్కృతి మార్చుకోవాలని చంద్రబాబు హితవు పలికారు.