" ఖబడ్దార్.. మరోసారి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడితే సహించం"
విజయవాడకు చెందిన టీడీపీ నేత, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు.
విజయవాడలోని పటమటలంకలో ఆదివారం టీడీపీ నేత, విజయవాడ మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో గాంధీ కంటి వద్ద తీవ్ర గాయమైంది. దీంతో ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి వైసీపీ గూండాల పనే అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. కాగా, చెన్నుపాటి గాంధీపై జరిగిన దాడి ఘటనపై విజయవాడ పోలీస్ కమిషనర్ స్పందించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. విచారణ చేస్తున్నామని వెల్లడించారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామనీ, దాడికి ఎలాంటి ఆయుధాలు వాడలేదని, టీడీపీ నేతపై చేతులతోనే దాడి చేసినట్టు వివరించారు. కంటిపై గాయం కావడంతో ఆయనను స్థానిక ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి తరలించారు. వారి రిపోర్ట్ లో కూడా చేతితో దాడి చేసినట్లు వెల్లడైందని తెలిపారు. చెన్నుపాటి గాంధీపై క్షణికావేశంలో దాడి జరిగిందని అన్నారు.
టీడీపీ నేత చెన్నుపాటి గాంధీపై దాడి వ్యవహరంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దాడి అనంతరం చంద్రబాబు నాయుడు.. గాంధీ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పిరికిపందల చర్య అని, ఓడిపోతామనే భయంతో వైసీపీ నాయకులు దాడికి పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.
ఇలాంటి దాడులు మరోసారి జరిగితే.. వదిలిపెట్టే సమస్య లేదని ఖబడ్దార్.. అని హెచ్చరించారు. గాంధీ కంటిపై పొడవడం దుర్మార్గపు చర్య అని.. ఈ దాడి ఘటనలో దుర్మార్గులకు శిక్ష పడే వరకు విడిచిపెట్టమనీ, సరైన న్యాయం జరిగే వరకు పోరాటం చేశామని హెచ్చరించారు. గతంలో ఇలాంటి ఘటనే జరిగిందనీ, విజయవాడలో టీడీపీ నాయకుడు పట్టాభిపై దాడి జరిగిన ఘటనను గుర్తుకు చేసుకున్నారు. ఆరోజు జరిగిన దాడికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే.. నేడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదనీ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని అధికార వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. ఇదే పరిస్థితి మీ కుటుంబాలకు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని చంద్రబాబు అన్నారు.
తమకు సొంత అజెండా లేదనీ, అమాయక ప్రజలకు జరుగుతున్న బాధితుల పక్షన నిలబడుతామని తెలిపారు. వైసీపీ అరాచకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లామనీ, వారిలో చైతన్యం కలిగిస్తామని అన్నారు. ప్రతిఘటించి తిరుగుబాటు చేసే పరిస్థితి త్వరలో వస్తుందని తెలిపారు. దాడులు చేసిన సంస్కృతి మార్చుకోవాలని అన్నారు. హత్యారాజకీయాలను ప్రేరేపితే.. ఊరుకునేదే లేదని చంద్రబాబు హెచ్చరించారు.