సొంత కేసుల కోసం ప్రైవేట్ లాయర్లు, ప్రజల సొమ్ము... సుప్రీంకోర్టే గడ్డి పెట్టింది : జగన్కు బొండా ఉమ చురకలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ తన వ్యక్తిగత కేసుల విచారణ కోసం ప్రైవేట్ లాయర్లను నియమించడంతో పాటు వారికి ప్రజాధనం నుంచి ఫీజులు చెల్లిస్తున్నారని ఆరోపించారు టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు.
ఏపీ సీఎం వైఎస్ జగన్పై మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ కేసుల కోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోందన్నారు. జగన్పై ఉన్న సీబీఐ, ఈడీ కేసులు వాదిస్తున్న లాయర్లకు ప్రభుత్వం ఫీజులు చెల్లించడం విడ్డూరమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం ప్రభుత్వం న్యాయవాదులను నియమించడంలేదని బొండా ఉమా ఎద్దేవా చేశారు. జగన్ కేసులు వాదిస్తున్న లాయర్లకు రూ.కోట్లు చెల్లించి ప్రభుత్వ కేసులు అప్పగించడం అన్యాయమన్నారు.
ALso Read:బాబాయ్ హత్యతో సంబంధం లేదని శ్రీవారిపై ప్రమాణం చేస్తారా : జగన్కు లోకేష్ సవాల్
పోలవరంపై గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ఒక ఎన్జీవో ఆర్గనైజేషన్ సుప్రీంకోర్టుకు వెళ్తే దానికీ ప్రభుత్వ సొమ్మే ఖర్చు చేశారని బొండా ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం ప్రైవేటు న్యాయవాదులను నియమించుకోవడంపై సుప్రీంకోర్టు కూడా నివ్వెరపోయిందని ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు. జగన్ న్యాయవాదులపై పెడుతున్న ఖర్చులపై నోటీసులు ఇవ్వాల్సివస్తుందని సుప్రీంకోర్టు పేర్కొందన్నారు. ప్రైవేటు న్యాయవాదులపై వందల కోట్లు ఫీజులుగా చెల్లించడం అన్యాయమని బొండా ఉమా వ్యాఖ్యానించారు. గాలి జనార్థన్ రెడ్డి, భారతి సిమెంటు, జగతి పబ్లికేషన్, వివేకానందరెడ్డి హత్య కేసులకు రాష్ట్ర ప్రజల సొమ్ము వాడుతారా అంటూ ఆయన ఫైరయ్యారు.