రోజా సీటుకి ఎసరు...?
నగరి ఎమ్మెల్యే సీటుకి చెక్ పెడుతున్న చంద్రబాబుు
వైసీపీ ఎమ్మెల్యే రోజా కి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెక్ పెట్టారా..? వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా నగరి నియోజక వర్గాన్ని హస్తగతం చేసుకునేందుకు టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తోందా..?
అవుననే సమాధానమే వినపడుతుంది. 2019 ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. ఇప్పటికే ఏ నియోజకవర్గం నుంచి ఏ అభ్యర్థిని నియమించాలనే విషయంపై ఇరు పార్టీల అధినేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
అయితే...రానున్న ఎన్నికల్లో నగరి నియోజకవర్గాన్ని టీడీపీ నేతలు సెంటర్ చేసినట్లు సమాచారం. ఎందుకంటే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రోజా..సమయం వచ్చినప్పుడల్లా.. చంద్రబాబు, అతని కుటుంబసభ్యులను కేంద్రంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఏ ఒక్క ఎమ్మెల్యేని, మంత్రిని వదలకుండా ఆమె ఆరోపణలు చేస్తూనే ఉంటారు. ఈ విషయంలో రోజాపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. అందుకే ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా గెలవకుండా ఉండేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.
ఈ ప్రచారానికి నిదర్శనంగా..‘చ్చే ఎన్నికల్లో నగరిలో టీడీపీ అభ్యర్థే గెలవాలని, ఇందుకు ఇప్పటినుంచే పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలి’ అంటూ మంత్రి ఎన్.అమరనాథరెడ్డి సహా తెలుగుదేశం నాయకులు పిలుపునిచ్చారు. నగరిలోని ఏజేఎస్ కల్యాణ మండపంలో నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడు గురువారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అమర్ మాట్లాడుతూ నగరి నియోజకవర్గానికి త్వరలో ఇన్చార్జిని నియమిస్తామని, సీఎం దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు.ఈలోపు ఎవరికి ఏ సమస్య ఉన్నా తమ వద్దకు రావచ్చని సూచించారు. అందరూ ఐక్యంగా 2019లో నగరిలో టీడీపీ జెండా ఎగిరేందుకు పట్టుదలతో పనిచేయాలన్నారు.
టీడీపీ నేతల తీరును చూస్తుంటే.. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో రోజా సీటుకి ఎసరు పెట్టేలాగే కనిపిస్తున్నారు.