టిడిపి కార్పొరేటర్ల రాజీనామా..కడపలో ముసలం
- రాజీనామా పత్రాలను జిల్లా టీడీపీ అధ్యక్షుడికి అందించారు.
కడప కలెక్టర్పై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. కలెక్టర్ వైఖరికి నిరసనగా టీడీపీ కార్పొరేటర్లు రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. 10 మంది కడప టీడీపీ కార్పొరేటర్లు రాజీనామా చేసి తమ నిరసనన వ్యక్తం చేశారు. రాజీనామా పత్రాలను జిల్లా టీడీపీ అధ్యక్షుడికి అందించారు. కలెక్టర్ బాబూరావు నాయుడు దురుసుగా ప్రవర్తించారని మనస్తాపం చెందిన కార్పొరేటర్లు రాజీనామా చేశారు.
ఇళ్ల స్థలాల్లో అక్రమాలపై ఇటీవల విచారణ కలెక్టర్ జరిపించారు. విచారణ వివరాలను అడగడానికి వెళ్తే కలెక్టర్ సరైన సమాధానం చెప్పలేదని కార్పొరేటర్లు ఆరోపించారు. టీడీపీ కార్పొరేటర్ల రాజీనామాలతో జిల్లాలో ఒక్కసారి కలకలం రేగింది.
సమస్యను పరిష్కరించేందుకు పెద్దల ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయటం ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం కడప మేయర్గా వైసీపీకి చెందిన సురేష్బాబు కొనసాగుతున్నారు.
కడప నగరపాలక సంస్థలో 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇందులో 42 డివిజన్లను వైసీపీ దక్కించుకుంది. ఎనిమిది స్థానాల్లో టీడీపీ కార్పొరేటర్లు గెలిచారు. ఎన్నికల తర్వాత జరిగిన సమీకరణాల్లో 12 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో ఫిరాయించారు. దీంతో టీడీపీ కార్పొరేటర్ల సంఖ్య 20కి చేరుకుంది. తర్వాత 10 మంది వైసీపీ కార్పొరేటర్లు తిరిగి సొంత గూటికి చేరారు. దీంతో ప్రస్తుతం టీడీపీలో మొత్తం కలిపి 10 కార్పొరేటర్లు ఉన్నారు.