కోవిడియట్స్... డ్యాన్సులతో కరోనాకి ఆహ్వానమా..: వైసిపి ఎమ్మెల్యేపై లోకేష్ సీరియస్ (వీడియో)
అధికారిక కార్యక్రమాల పేరిట వైసిపి నాయకులు కరోనా నిబంధనలను అతిక్రమిస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు.
గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారిక కార్యక్రమాల పేరిట వైసిపి నాయకులు కరోనా నిబంధనలను అతిక్రమిస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. పబ్లిసిటీపై తప్ప ప్రజారోగ్యంపై జగన్ ప్రభుత్వం ఆలోచించడం లేదని లోకేష్ మండిపడ్డారు.
''కోవిడియట్స్ అని జాతీయ మీడియా ఉతికారేసినా బుద్ది రాలేదు. కరోనా పెద్ద విషయం కాదు లైట్ తీసుకోండి అని స్వయంగా వైఎస్ జగన్ గారే సెలవిచ్చాకా వైకాపా ఎమ్మెల్యేలు తగ్గుతారా? డ్యాన్సులతో కరోనాకి ఆహ్వానం పలుకుతున్నారు'' అంటూ నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
read more ప్రజల దృష్టిని మరల్చేందుకే అమరావతి భూములపై దుష్ప్రచారం: చంద్రబాబు
''పబ్లిసిటీతో పేదవాడి కడుపు నిండదు వైఎస్ జగన్ గారు. అనంతపురం జిల్లాలో ఈ రోజు జరిగిన రెండు ఘటనలు మీ అసమర్థ ప్రభుత్వ పనితీరుకి అద్దం పడుతున్నాయి. ఆసరా అందక ఉరవకొండలో వైకాపా నేత విశ్వేశ్వరరెడ్డి గారిని మహిళలు నిలదీశారు'' అని అన్నారు.
''పెనుకొండలో పరిగి చెరువుకు నీళ్లు రావడం లేదంటూ మంత్రి శంకరనారాయణ గారిని రైతులు అడ్డుకొని నిలదీశారు. ప్రజలు నిలదీస్తారు అన్న భయంతోనే జగన్ రెడ్డి గారు తాడేపల్లి ఇల్లు దాటి బయటకు రావడం లేదు'' అంటూ లోకేష్ ట్విట్టర్ వేదికన మండిపడ్డారు.