Ayodhya: ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి చంద్రబాబు.. అయోధ్యకు 21న ప్రయాణం
అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి చంద్రబాబుకు ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. 22న ఈ కార్యక్రమం జరగనుంది. చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. 21వ తేదీనే ఆయన అయోధ్యకు బయల్దేరనున్నారు.
![tdp chief chandrababu naidu to attend ayodhya ram temple consecration ceremony will leave for jan 21st kms tdp chief chandrababu naidu to attend ayodhya ram temple consecration ceremony will leave for jan 21st kms](https://static-ai.asianetnews.com/images/01gj7q2ntaj25656em14eba4j2/chandrababu-naidu-jpg_363x203xt.jpg)
Chandrababu: టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం అందింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులు ఈ ఆహ్వానాన్ని అందించిన సంగతి తెలిసిందే. 22న ఈ కార్యక్రమం జరుగుతున్నది. చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. అందుకు ఒక రోజు ముందు 21వ తేదీన సాయంత్రం ఆయన అయోధ్యకు బయల్దేరుతున్నారు.
ఈ నెల 22న మధ్యాహ్నం 2.20 గంటలకు అయోధ్య రామ మందిరం గర్భగుడిలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టత కార్యక్రమం జరుగుతుంది. గురువారమే గర్భగుడిలోకి రాముడి విగ్రహాన్ని చేర్చారు. ఈ కార్యక్రమానికి పలు రంగాలకు చెందిన 8 వేల మంది ప్రముఖులకు ఆహ్వానం అందిస్తున్నారు. ఈ ఆహ్వాన పత్రిక పంపిణీని అధికారులు ఇంకొంచెం వేగవంతంగా చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మెగాస్టార్ చిరంజీవి, ఆయ తనయుడు రామ్ చరణ్కు, సినీ హీరో ప్రభాస్కు కూడా ఈ ఆహ్వానాలు అందాయి. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్కు కూడా ఈ ఆహ్వాన పత్రిక అందింది.
ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష కూటమి పార్టీలు వెళ్లడం లేదు. బీజేపీ ఈ కార్యక్రమాన్ని రాజకీయ లబ్ది కోసం చేపడుతున్నదని, ఆ తర్వాత ఆలయానికి వెళ్లుతామని పలు పార్టీలు ప్రకటించాయి. ఎన్టీఏలో లేదా ఇండియా కూటమిలో లేని చంద్రబాబు.. ఈ కార్యక్రమానికి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి గతంలోనూ మోడీని చంద్రబాబు నాయుడు పొగిడారు. కానీ, ఎన్డీఏలోకి చంద్రబాబు పార్టీని చేర్చుకోవడంపై బీజేపీ వెనుకాముందు ఆడుతున్నది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఈ కార్యక్రమానికి వెళ్లుతుండటం గమనార్హం. మరోవైపు ఏపీలోని ఎన్డీయే భాగస్వామి జనసేనతో టీడీపీ పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల వరకు బీజేపీ కూడా జనసేన టీడీపీతో కలిసి నడుస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉన్నది.