తమ్మినేని సీతారాం: బాల్యం, విద్య, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం..
Tammineni Sitaram Biography: ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘ చరిత్ర గల నాయకుడు. నవ్యాంధ్రప్రదేశ్ కి రెండవ స్పీకర్. ఆయనే తమ్మినేని సీతారాం. ఈ నేపథ్యంలో తమ్మినేని సీతారాం వ్యక్తిగత, రాజకీయ జీవితం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Tammineni Sitaram Biography:
తమ్మినేని సీతారామ బాల్యం , విద్యాభ్యాసం
తమ్మినేని సీతారాం 1955 జూన్ 10న ఆముదాలవలస మండలం తొగరాం గ్రామంలో తమ్మినేని శ్రీరామమూర్తి- ఇందుమతి దంపతులకు జన్మించారు. ఆయన విద్యాభ్యాసం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు. డిగ్రీ చేస్తున్న రోజుల్లో ఆయన అల్లూరి సీతారామరాజు వంటి ఎన్నో రంగస్థలం, సాంఘిక నాటకాలు పోషించారు. ఆయన ఆర్ట్స్ కాలేజ్ చైర్మన్ గా కూడా పనిచేశారు.
రాజకీయ ప్రస్థానం
తమ్మినేని సీతారాం 1980లో తన 18 ఏటానే ఆముదాలవలస షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ గా నియమితులయ్యారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక ఎన్టీఆర్ గారి పిలుపు మేరకు ఆయన ఆ పార్టీలో చేరారు. 1983లో ఆమదాలవలస నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి.. గెలుపొందారు. తొలిసారి అసెంబ్లీలో కాలుమోపారు తమ్మినేని సీతారాం. ఇలా1983, 1985,1994,1999,2019లో (ఐదు సార్లు) శాసనసభ్యుడుగా ఎన్నికయ్యారు.
తొమ్మిదేళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా పనిచేశారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంతో 18 శాఖల బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రభుత్వ విప్ గా ఐదేళ్ళు, శాప్ డైరక్టరుగా మూడేళ్ళు సేవలందించారు. తెలుగుదేశం పార్టీకి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షునిగా మూడుసార్లు పనిచేశారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో సొంత పార్టీ సీనియర్ లీడర్లు అయినా ఎర్రం నాయుడు, కళా వెంకటరావు వంటి లీడర్లతో విభేదాలు రావడంతో ఆయన పార్టీని వీడాల్సివచ్చింది.
ప్రజారాజ్యంలో చేరిక
ఆ తర్వాత 2009లో చిరంజీవి ఆహ్వానం మేరకు ప్రజారాజ్యం పార్టీ చేరారు తమ్మినేని సీతారాం. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయన పూర్వ నియోజకవర్గమైన ఆముదాలవలస నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఆపరేషన్ స్వగృహ పేరిట టీడీపీ వదిలి ఇతరపార్టీలో చేరిన నేతలను తిరిగి సొంత పార్టీలో చేరమని పిలుపునిచ్చారు. కానీ, తమ్మినేని ఆ పిలుపును తిరస్కరించారు. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. విభజన విషయంలో చంద్రబాబు కీలకంగా వ్యవహరించారని సీతారాం నిప్పులు చేరగారు.
వైసీపీలోకి ఎంట్రీ
అనంతరం 2013 ఆగస్టు 29న జగన్ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. 2014 ఎన్నికల్లో ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గాల నుండి వైయస్సార్ పార్టీ తరపున పోటీ చేసి.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయినా.. ఏ మాత్రం కుంగిపోలేదు. పార్టీని వీడలేదు. 2019 జరిగిన ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూన రవికుమార్ పై విజయం సాధించాడు. నవ్యాంధ్రప్రదేశ్ కి రెండవ స్పీకర్ గా ఎన్నికయ్యారు. శ్రీకాకుళం జిల్లా నుంచి సీతారాం నాలుగో స్పీకర్. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదటి స్పీకర్గా ఆర్ఎల్ఎన్ దొర, రెండో స్పీకర్గా తంగి సత్యనారాయణ, మూడో స్పీకర్గా కె. ప్రతిభాభారతి ఎన్నికయ్యారు.