అంతర్వేది స్వామివారి రథం అగ్నికి ఆహుతి... విశాఖ పీఠాధిపతి ఏమన్నారంటే (వీడియో)
అంతర్వేదిలోని ప్రముఖ హిందూ దేవాలయంలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి విచారం వ్యక్తం చేశారు.
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలోని ప్రముఖ హిందూ దేవాలయం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంలో స్వామివారి ఉత్సవ రథం అగ్నికి ఆహుతి కావటంపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి విచారం వ్యక్తం చేశారు.
''అంతర్వేది ఘటన దురదృష్టకరం. రధం ఆహుతి కావడంపై తక్షణం విచారణ జరపాలి. దుండగుల చర్యగా తేలితే కఠినంగా శిక్షించాలి. హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశమిదని అన్నారు. స్వామి రధోత్సవం లోపు నూతన రధ నిర్మాణం పూర్తయ్యేలా దేవాదాయ శాఖ పూనుకోవాలి'' అని స్వరూపానందేంద్ర వైసిపి ప్రభుత్వానికి సూచించారు.
ఈ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ కమిషనర్ కు, జిల్లా ఎస్పీకి ఫోన్ చేశారు. ప్రమాదం జరిగిన తీరు తెన్నులను అడిగి తెలుసుకొన్నారు.
అంతర్వేదిలో రథం దగ్ధం కావడంపై దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్ ను విచారణ అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆదివారం నాడు తెల్లవారుజామున రథం అగ్నికి ఆహుతైంది. ఈ విషయం తెలిసి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు దిగ్భ్రాంతి చెందారు.